
నరాలరామారెడ్డికి సతీ వియోగం
బైక్ ఢీ కొని మృతి చెందిన సరోజమ్మ
ప్రొద్దుటూరు క్రైం : ప్రముఖ శతావధాని నరాలరామారెడ్డి సతీమణి సరోజమ్మ (70) ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె వీధిలో వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని బైక్ ఢీ కొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నరాల రామారెడ్డి, సతీమణి సరోజమ్మలు వైఎంఆర్కాలనిలోని విహంగ–2 అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు ముగ్గురు విదేశాల్లో ఉంటున్నారు.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి సరోజమ్మ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని బైక్ ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.