
భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి
కడప కల్చరల్: స్వామి భక్తి, కార్యదక్షత, అమేయ శక్తిసంపదలకు ప్రతిరూపమైన పవన కుమారుడు హనుమంతుడికి గురువారం భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. హనుమజ్జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని ఆంజనేయస్వామి ఆలయా లు, రామాలయాలలో ప్రత్యేక పూజలు, అలంకారా లు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి స్వామి మూల విరాట్కు అభిషేకాలు చేసి కనుల పండువగా అలంకారం నిర్వహించారు. భక్తులు స్వామికి ఆకుపూజ, కుంకుమపూజ, సింధూర పూజలను నిర్వహించారు. దాదాపు అన్ని ఆంజనేయస్వామి ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. ఆలయాల వద్ద మధ్యా హ్నం భక్తులకు అన్నదానాలు నిర్వహించారు. కడప నగరంలోని దాదాపు 25 ఆలయాలలో ఆంజనేయునికి హనుమజ్జయంతి విశేష పూజలు చేశారు.
కళకళలాడిన గండి క్షేత్రం
చక్రాయపేట: హనుమజ్జయంతి సందర్భంగా గురువారం గండి వీరాంజనేయ స్వామి సన్నిధి జైశ్రీరామ్ అనే రామనామ స్మరణతో మారు మోగింది. గండిక్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ సహాయ కమీషనర్ వెంకటసుబ్బయ్య, చైర్మన్ కావలి కృష్ణతేజల ఆధ్వర్యంలో ప్రధాన,ఉప ప్రధాన,ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్,రాజగోపాలాచార్యులు లు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు.
ముగిసిన వేడుకలు
గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో నాలుగు రోజులుగా జరుగుతున్న హనుమజ్జయంతి వేడుకలు గురువారంతో ముగిశాయి.చివరి రోజున త్రికాల ఆరాధన,పంచసూక్త హోమం,మన్యు సూక్త హోమం,ఆంజనేయ స్వామి మూలమంత్ర తదితర హోమాలు నిర్వహించారు.
ఘనంగా శోభాయాత్ర
గండి వీరాంజేయ స్వామి సన్నిధి నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా జరిగింది. చక్రాయపేటలో వెలసిన శ్రీవేంకటేశ్వర,రాచరాయస్వామి ఆలయాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాత్ర గండి నుంచి అద్దాలమర్రి, కుమార్లకాల్వ, చిలేకాంపల్లెల మీదుగా చక్రాయపేటలోని ఆలయాల వద్ద ముగించారు.ఆలయాల చైర్మన్ మోపూరి రామాంజనేయ రెడ్డి,మాజీ చేర్మెన్లు చక్రపాణిరెడ్డి, ఓబుళరెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.