
ఏటీఎస్ వస్తోంది.. ఎఫ్సీ చేయించుకోండి !
● ఎఫ్సీ కోసం పరుగులు పెడుతున్న విద్యాసంస్థల బస్సులు
● స్కూల్ బస్సులకు ఈ నెల 15 వరకు ఎఫ్సీలకు గడువు ఉన్నా..
● మరీ యాజమాన్యాలకు
ఫోన్లు చేసి పిలిపిస్తున్న వైనం
● ఇప్పటికే 90 శాతం పైగా స్కూల్
బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ
● ఒక్కో వాహనానికి అదనంగా
రూ. 2000–2500 వసూలు ?
ప్రొద్దుటూరు క్రైం : వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరుస్తున్నారంటే రవాణాశాఖ కార్యాలయాల వద్ద విద్యాసంస్థల బస్సుల సందడి కనిపిస్తుంది. మే 15 వరకు ఫిట్నెస్ పరీక్షలు చేయించేందుకు వీటికి గడువు ఉంటుంది. ఈ లోగా ఆయా పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను తరలించే వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాలి. గడువు ముగిసిన తర్వాత ఎఫ్సీ చేయించుకుంటే రోజుకు రూ. 10 చొప్పున ఫైన్ కట్టాలి. వేసవి సెలవుల దృష్ట్యా పాఠశాలలు ఉండవు కనుక జూన్ 12 వరకు స్కూల్ బస్సులు బయట తిరగవు. దీంతో మే 15తో ఎఫ్సీ గడువు ముగిసినా కూడా విద్యాసంస్థల యాజమాన్యాలు తమ వాహనాలకు జూన్ మొదటి వారంలో ఎఫ్సీ చేయించుకునేందుకు ఆర్టీఏ కార్యాలయాలకు తీసుకెళ్తారు. గడువు ముగిసిన రోజులకు గాను రోజుకు రూ. 10 చొప్పున జరిమానా మొత్తాన్ని చెల్లించి పాఠశాలలు తెరిచే నాటికి ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేయించుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా ఇలానే జరుగుతుంది. వేసవి సెలవుల అనంతరం జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత ఎఫ్సీ చేయించుకోకుండా రోడ్డెక్కే వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించి కేసులు నమోదు చేస్తారు. ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎక్కడికక్కడ స్కూల్ బస్సులను తనిఖీ చేస్తారు. అయితే ఈ సారి ఏప్రిల్ 16 నుంచే ఫిట్నెస్ చేయించుకునేందుకు విద్యా సంస్థల వాహనాలు ఆర్టీఓ కార్యాలయాలకు పరుగులు తీశాయి. ఏప్రిల్ చివరి నాటికే సుమారు 80 శాతంపైగా వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు చేశారు. గతంలో ఎన్నడూ ఇంత త్వరగా స్కూల్ బస్సులకు ఎఫ్సీలు చేయలేదు.
ఏటీఎస్ పేరుతో పరుగులు పెట్టిస్తున్న వైనం..
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఏటీఎస్ (ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్) లు అందుబాటులోకి వచ్చాయి. ఏటీఎస్ల ద్వారా వాహనాలను పరీక్షించి ఎఫ్సీలు జారీ చేయాలని ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏటీఎస్లో మనుషుల ప్రమేయం లేకుండా పూర్తిగా అధునాతన యంత్రాలతో వాహన సామర్థ్య పరీక్షలను నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏటీఎస్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా కడపలో కూడా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నారు. ఎప్పటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రొద్దుటూరులోని రవాణాశాఖ కార్యాలయ సిబ్బంది మాత్రం ఏటీఎస్ పేరుతో పాఠశాల యాజమాన్యాలను పరుగులు పెట్టిస్తున్నారు. మే 15 తర్వాత కడపలో ఏటీఎస్ సేవలు ప్రారంభం అవుతున్నాయి.. అక్కడికి వెళ్తే ఖర్చు పెరగడంతో పాటు ఎఫ్సీ చేయించుకోవడం కష్టం అవుతుంది అంటూ విద్యాసంస్థల యాజమాన్యాలకు కంగారు పెట్టిస్తున్నారు. హోంగార్డులు, కార్యాలయంలో పని చేసే సిబ్బంది, ముఖ్య ఏజెంట్ల ద్వారా స్కూల్ బస్సుల యజమానులకు ఫోన్లు చేయించినట్లు కూడా తెలుస్తోంది. కడపకు వెళ్తే ఖర్చు పెరుగుతుందని, చిన్నపాటి లోపాలున్నా తెలిసిన అధికారులే కనుక చూసీ చూడనట్లు వెళ్తారని వారు ఫోన్ల ద్వారా చెప్పినట్లు సమాచారం. దీంతో స్కూల్ బస్సులన్నీ ఏప్రిల్ 16 నుంచే ఆర్టీఏ కార్యాలయానికి క్యూ కట్టాయి.
ఆర్టీఓ ఏమంటున్నారంటే..
కడపలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ వస్తుందని మేము ఎవరికీ చెప్పలేదు. పాఠశాల యాజమాన్యాలే తెలుసుకొని ఉంటారు. అందుకే కడపకు వెళ్లడం భారమని ఇక్కడే ముందుగానే ఎఫ్సీ చేయించుకుంటున్నారు. ఎఫ్సీ చేయించుకునేందుకు వాహనాల నుంచి అదనంగా ఎలాంటి రుసుం వసూలు చేయలేదు. ఆన్లైన్లోనే వాహన యజమానులు చలానా కట్టుకొని మా ఆఫీసుకు వస్తున్నారు అని ప్రొద్దుటూరు ఆర్టీఓ మురళీధర్ తెలిపారు.
ఒక్కో వాహనానికి భారీగా అదనపు వసూలు
ప్రొద్దుటూరు ఆర్టీఓ కార్యాలయ పరిధిలో ప్రొద్దుటూరుతో పాటు రాజుపాళెం, చాపాడు, దువ్వూరు, జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం, ఎర్రగుంట్ల మండలాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో విద్యా సంస్థల బస్సులు సుమారు 340 వరకు ఉన్నాయి. ఎఫ్సీ చేయించేందుకు ప్రభుత్వ ఫీజు సీటింగ్ సామర్థ్యాన్ని బట్టి రూ.800–950 వరకు ఉంది. అయితే ఎఫ్సీ చేయించుకోవడం పూర్తి అయిన తర్వాత స్థానికంగా ఒక డ్రైవింగ్ స్కూల్లో పని చేస్తున్న ఒక వ్యక్తి విద్యాసంస్థల వాహనాల యాజమాన్యాల నుంచి రూ. 2000–2500 వరకు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రవాణాశాఖ అధికారుల పేరుతో అతను ఈ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మొత్తాన్ని ఎవరికి ఇస్తున్నాడో తెలియాల్సి ఉంది. ఈ అదనపు వసూళ్ల కోసమే పాఠశాల యాజమాన్యాలను ఎఫ్సీ చేయించుకోమని పరుగులు పెట్టించినట్లు తెలుస్తోంది.

ఏటీఎస్ వస్తోంది.. ఎఫ్సీ చేయించుకోండి !