కడప వీఅండ్‌ఎస్‌ఓ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

కడప వీఅండ్‌ఎస్‌ఓ సస్పెన్షన్‌

May 10 2025 8:06 AM | Updated on May 10 2025 8:06 AM

కడప వీఅండ్‌ఎస్‌ఓ సస్పెన్షన్‌

కడప వీఅండ్‌ఎస్‌ఓ సస్పెన్షన్‌

కడప కోటిరెడ్డి సర్కిల్‌: ఏపీఎస్‌ ఆర్టీసీ కడప విజిలెన్స్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా (వీఅండ్‌ఎస్‌ఓ) పని చేస్తున్న ముజబుర్‌ రెహమాన్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆర్టీసీ రాష్ట్ర ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై పలు అవినీతి ఆరోపణలు రావడంతోపాటు అక్రమ వసూళ్లపై ఇటీవల అధికారులతో ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో పలు అంశాలు వాస్తవాలని తేలడంతో ఆయనను సస్పెండ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సులో శిక్షణ

జమ్మలమడుగు: పట్టణంలోని ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పాలిటెక్నిక్‌ కాలేజి ప్రిన్సిపల్‌ రవికుమార్‌, జిల్లా నైపుణ్యాధికారి వినీల్‌కుమార్‌లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముద్దనూరు రహదారిలో అంబవరం పంచాయతీ పరిధిలో ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 15వ తేదీ లోపు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్‌, డిప్లొమో ఉత్తీర్ణత కలిగి ఉండి 18 సంవత్సరాలు నిండి ఉండాలని సూచించారు. వివరాలకు 90004 79991 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకోవచ్చునని సూచించారు.

హుండీ ఆదాయం లెక్కింపు

బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి క్షేత్రంలో శుక్రవారం హుండీ ఆదాయం లెక్కించారు. స్వామి ఆరాధన, గురుపూజోత్సవాలు ముగిసిన సందర్భంగా హుండీల ఆదాయం లెక్కింపు చేపట్టారు. 7 శాశ్వత, 4 తాత్కాలిక హుండీలు లెక్కించారు. మొత్తం రూ. రూ.47 లక్షల 26 వేలు వచ్చినట్లు ఫిట్‌ పర్సన్‌ శంకర్‌బాలాజి తెలిపారు. 8 గ్రాముల బంగారం, 530 గ్రాముల వెండి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 21 నుంచి మే 9 వరకు భక్తులు సమర్పించిన నగదు, కానుకల లెక్కింపు చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పూర్వపు మఠాధిపతుల కుమారులు శ్రీ వెంకటాద్రిస్వామి, వీరభద్రయ్యస్వామి, వీరంబొట్లయ్య స్వామి, దత్తాత్రేయ స్వామి, గోవింద స్వామి, వరదరాజ స్వామి, మేనేజర్‌ ఈశ్వరయ్య ఆచారి, ఆలయ సిబ్బంది, స్వామి శిష్యులు, భక్తబందం పాల్గొన్నారు.

హెచ్‌ఓడీలు, పరిపాలన సిబ్బందితో సమీక్ష

కడప అర్బన్‌: కడప ప్రభుత్వ వైద్యకళాశాలలో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలను చేపట్టిన తరువాత డాక్టర్‌ జమున తన కాన్ఫరెన్స్‌ హాల్‌లో అన్ని విభాగాల హెచ్‌ఓడీలు, వైద్యులతో, కళాశాల పరి పాలన విభాగం అధికారులు, సిబ్బందితో ప్రత్యే కంగా సమీక్ష నిర్వహించారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ప్రిన్సిపాల్‌ను కలిసిన గైనకాలజీ వైద్యబృందం

ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.జమునను శుక్రవారం గైనకాలజీ విభాగం హెచ్‌ఓడి డాక్టర్‌ లక్ష్మీసుశీలతో పాటు వైద్యబృందం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందచేసి శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్‌ పద్మావతి, డాక్టర్‌ రబ్బానీబేగం, డాక్టర్‌ రేఖారావు, డాక్టర్‌ నీలిమ, డాక్టర్‌ సుధారాణి, డాక్టర్‌ సోఫియా సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

● అలాగే కడప రిమ్స్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం నుంచి నాయకులు వెంకటసుబ్బయ్య, బాలాజీరావు, ఏసన్న, పవన్‌, తదితరులు విచ్చేసి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జమునకు మొక్కను అందచేశారు. కడప రిమ్స్‌ వైద్యకళాశాలలో, ఆసుపత్రిలో కార్మికుల సమస్యలను వివరించారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

కడప ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా ఈ నెల 12వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్మీడియట్‌ ఆర్‌ఐఓ బండి వెంకటసుబ్బయ్య సూచించారు. శుక్రవారం కడప మరియాపురం సెయింట్‌ జోసెఫ్‌ జూనియర్‌ కళాశాలలో పరీక్షల నిర్వహణపై ఛీప్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులకు సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 12 నుంచి 20వ తేదీ వరకు ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రాలలో 47,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 నుండి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పరీక్షల ఈసీ మెంబర్స్‌ రామకృష్ణారెడ్డి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement