
కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్రగుంట్లకు చెందిన నంద్యాల నిర్మల (40) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. ఎస్ఐ విద్యా సాగర్ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎర్రగుంట్ల పట్టణం క్రాంతి నగర్కు చెందిన బ్రహ్మానందరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి కారులో కడప నుంచి ఎర్రగుంట్లకు వెళ్తుండగా మార్గ మధ్యంలో కమలాపురం మండలం పందిళ్లపల్లె సమీపంలోనికి రాగానే ఎర్రగుంట్ల నుంచి కడప వైపు వెళ్లే తుఫాన్ వాహనం ప్రమాదవశాత్తు ఢీ కొంది. ఈ ఘటనలో బ్రహ్మానందరెడ్డి భార్య నిర్మల అక్కడికక్కడే మృతి చెందారు. బ్రహ్మానందరెడ్డితో పాటు వారి ఇద్దరు పిల్లలు, తుఫాన్ డ్రైవర్ అయిన చెప్పలి నరసింహులుకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ విద్యాసాగర్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నిర్మల మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ప్రొద్దుటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
మహిళ మృతి
నలుగురికి గాయాలు