జెండా దిమ్మె ఏర్పాటుపై కార్మిక సంఘాల గొడవ | - | Sakshi
Sakshi News home page

జెండా దిమ్మె ఏర్పాటుపై కార్మిక సంఘాల గొడవ

Apr 28 2025 12:14 AM | Updated on Apr 28 2025 12:14 AM

జెండా దిమ్మె ఏర్పాటుపై కార్మిక సంఘాల గొడవ

జెండా దిమ్మె ఏర్పాటుపై కార్మిక సంఘాల గొడవ

మదనపల్లె : మేడే సందర్భంగా జెండా ఎగుర వేసేందుకు దిమ్మె ఏర్పాటు విషయం రెండు యూనియన్ల మధ్య వివాదానికి కారణమైంది. మున్సిపాలిటీలో ఇతర యూనియన్ల జెండా దిమ్మె ఏర్పాటును అంగీకరించేది లేదంటూ ఏఐటీయూసీ నాయకులు అడ్డుకుంటే, ఎలాగైనా జెండా దిమ్మె ఏర్పాటుచేసి తీరుతామంటూ సీఐటీయూ నాయకులు పంతానికి దిగారు. చివరకు రెండు యూనియన్ల మధ్య జెండా దిమ్మె ఏర్పాటుపై మొదలైన వివాదం చిలికి, చిలికి గాలివానగా మారి ఒక వర్గంపై మరొకరు దాడులు చేసుకుని పోలీసు కేసులు పెట్టుకునేంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎట్టకేలకు పోలీసులు జోక్యం చేసుకుని ఆదివారం మున్సిపల్‌ కమిషనర్‌ అందుబాటులో లేరని, సోమవారం కమిషనర్‌ సూచనలతో ఏర్పాటు చేసుకోవాలని సర్దిచెప్పడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. మదనపల్లె మున్సిపాలిటీలో చాలాకాలంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మాత్రమే కార్మిక సంఘం ఉండేది. కొద్దిరోజుల క్రితం ఏఐటీయూసీ నాయకుల ఆధిపత్యం భరించలేక, కార్మికుల్లో కొందరు విడిపోయి సీఐటీయూ యూనియన్‌లో చేరారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య చిన్న చిన్న వివాదాలు జరుగుతుండేవి. ఒక యూనియన్‌లో నుంచి మరో యూనియన్‌లో చేరాల్సిందిగా కార్మికులపై ఒత్తిడి తెచ్చేవారు. అందులో భాగంగా ఆదివారం ఉదయం సీఐటీయూలోకి వెళ్లిన ఇద్దరు పర్మినెంట్‌, ఇద్దరు ఆప్కాస్‌ కార్మికులను ఏఐటీయూసీలోకి చేర్చుకున్నారు. ఇదిలాఉంటే.. మే1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా.. మున్సిపల్‌ కార్యాలయ ప్రహరీకి ఆనుకుని జెండా దిమ్మె ఏర్పాటు చేసుకునేందుకు సీఐటీయూ నాయకులు సామగ్రి తరలించారు. విషయం తెలుసుకున్న ఏఐటీయూసీ నాయకులు నాగరాజు, సురేష్‌, ముబారక్‌, సాంబశివ, పృథ్వీరాజ్‌, అశోక్‌, ఓబులేసు తదితరులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సీఐటీయూ అనుబంధసంఘం కోశాధికారి రామకృష్ణ, ఏఐటీయూసీ నాయకులు ఓబులేసు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement