వైఎస్సార్‌టీయూసీ కార్మికుల పక్షపాతి

ధ్వజస్తంభానికి పూజ చేస్తున్న శ్రీవెంకటాద్రిస్వామి  - Sakshi

కడప కార్పొరేషన్‌ : వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ (వైఎస్సార్‌టీయూసీ) కార్మికుల పక్షపాతిగా ఉండి, వారి సమస్యల కోసం పోరాటం చేయడం వల్లే గుర్తింపు సాధించిందని ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు కె.సురేష్‌ బాబు, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్సార్‌టీయూసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసి, దివంగత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు మేలు చేయాలంటే ఒక్క వైఎస్సార్‌టీయూసీకే సాధ్యమన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిత్యం కార్మికుల సంక్షేమం కోసం పని చే స్తోందన్నారు. ఆటో కార్మికుల కోసం ప్రతి ఏడాది రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తున్నారన్నారు. టైల ర్లు, రజకులను కూడా కార్మికులుగా గుర్తించి రూ.10 వేల సాయం అందించడం జరుగుతోందన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల కోసం ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి పారదర్శకంగా వేతనాలు ఇస్తున్నారన్నారు. కార్మికుల సంక్షేమంపై ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కార్మికవర్గం అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్‌, ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు చైర్మన్‌ పులి సునీల్‌, వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం.జాషువా, నగర అధ్యక్షుడు నాగరాజు, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంగళ్‌రెడ్డి, ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ వినోద్‌, సుభాన్‌బాషా, మహిళా నేతలు రత్నకుమారి, బండి మరియలు, టీపీ వెంకట సుబ్బ మ్మ, క్రిష్ణవేణి, సునీత, మల్లీశ్వరి పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో హిజ్రా దుర్మరణం

– మరో హిజ్రాకు తీవ్ర గాయాలు

కడప అర్బన్‌ : కడప నగర శివారులోని చిన్నచౌక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి వైఎస్‌ఆర్‌ లే ఔట్‌ వెళ్లేదారి సమీపంలో తిరుపతి– తాడిపత్రి బైపాస్‌ రోడ్డులో భిక్షాటన చేస్తున్న ఇద్దరు హిజ్రాలను గుర్తుతెలియని లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ సంఘటనలో మహేష్‌ అలియాస్‌ మనీషా (22) అనే హిజ్రా అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో హిజ్రా ఆది వెంకటేష్‌ అలియాస్‌ రాధ (23) తీవ్రంగా గాయపడ్డాడు. వీరిని స్థానికులు రిమ్స్‌కు తరలించారు. మహేష్‌ అలియాస్‌ మనీషాది శ్రీసత్యసాయిజిల్లా తలుపుల మండలం వేములగొంది గ్రామం. కొంత కాలంగా కడప నగర శివారులోని తిలక్‌నగర్‌లో తన సహచర హిజ్రాలతోపాటు వుంటూ జీవిస్తున్నాడు. ఆది వెంకటేష్‌ అలియాస్‌ రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అమర్‌నాథ్‌రెడ్డి తెలియజేశారు.

ఘనంగా ధ్వజస్తంభ మండల ఆరాధన

బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలోని జగద్గురు శ్రీమద్విరాట్‌ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ప్రాంగణంలో మంగళవారం నూతన ధ్వజస్తంభ మండల ఆరాధనోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న నూతన ధ్వజస్తంభం ప్రతిష్టించారు. ఈ నెల 29 నాటికి 41వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆరాధన పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మఠం ఆస్థాన సిద్ధాంతి ఇడమకంటి జనార్ధన శివాచార్య బృందం ఆధ్వర్యంలో హోమాలు చేశారు. కార్యక్రమంలో మఠం ఫిట్‌ పర్సన్‌ శంకర్‌ బాలాజీ, పూర్వపు మఠాధిపతులు శ్రీవీరబోగ వసంత వెంకటేశ్వరస్వాముల కుటుంబ సభ్యులు, జ్యేష్ట పుత్రుడు శ్రీవెంకటాద్రిస్వామి, ధ్వజస్తంభ దాతలు, మేనేజర్‌ ఈశ్వరయ్యఆచారి, స్వామి శిష్యులు, భక్తులు పాల్గొన్నారు.

బైక్‌ను ఢీకొన్న లారీ

– తండ్రి, తనయుడికి తీవ్ర గాయాలు

రామాపురం : బైక్‌ను లారీ ఢీకొనడంతో తండ్రి, తనయుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధి చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిలోని బీసీ కాలనీ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి వైపు నుంచి కడప వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో సూరి(28), ఆయన తనయుడు భరత్‌(4)కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితులను 108లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కొండారెడ్డి తెలిపారు.

అనుమానాస్పద మృతి కేసు నమోదు

ఓబులవారిపల్లె : గోవిందంపల్లె పంచాయతీ పోలివండ్లపల్లె దళితవాడ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(48) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌చార్జి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటేశ్వర్లు పోలివండ్లపల్లె గ్రామ పరిసరాల్లో కూలి పనులు చేసుకొని జీవనం సాగించే వాడు. ఆయనకు శివప్రసాద్‌ అనే కుమారుడు ఉన్నాడు. ఈ నెల 24న బయటకు వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. ఆయన కోసం బంధువులతో కలిసి శివప్రసాద్‌ చుట్టుపక్కల గాలించగా.. యాల్లాయపల్లె గట్టుపై శవమై కనిపించాడు. అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తన అన్నను కుమారుడు శివప్రసాద్‌ హత్య చేశాడని అనుమానం ఉందని మృతుడి తమ్ముడు నరసింహులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మంగళవారం మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top