టెన్త్ ఫలితాల్లో జిల్లాలో అత్యధికంగా తెలుగులోనే ఫెయిల్ అయ్యారు. గత మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పబ్లిక్ పరీక్షలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 8,918 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,766 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో మొత్తం 152 మంది విద్యార్థులు ఫెయిల్ కాగా తెలుగులో 75మంది, హిందీలో ముగ్గురు, ఇంగ్లిష్లో 39, గణితంలో 36, సైన్స్లో 29, సాంఘిక శాస్త్రంలో ఐదుగురు అనుత్తీర్ణులయ్యారు.
భువనగిరి: పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు సత్తాచాటాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జెడ్పీ ఉన్నత పాఠశాలలు, మోడల్, కేజీబీవీలు, టీఎస్ఆర్ఈఐఎస్,ఎస్టీ గురుకుల పాఠశాలలు కలిపి మొత్తం 176 ఉండగా 122 స్కూళ్ల వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టడం, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారు కనీసం ఉత్తీర్ణత సాధించేలా సన్నద్ధం చేయడంలో సఫలమయ్యారు. కొన్ని స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణతసాధించేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కొంత మంది విద్యార్థులను దత్తత తీసుకుని వారి పై పర్యవేక్షణ చేయడం, ప్రభుత్వం పెట్టిన పరీక్షలు కాకుండా అదనంగా ఎగ్జామ్స్ నిర్వహించడం వంటి కార్యక్రమాలతో సక్సెస్ కాగలిగారు. ఈ సారి పరీక్షకు మరో పరీక్షకు మధ్య సుమారు నాలుగు రోజులు వ్యవధి ఇవ్వడం ఉపాధ్యాయులు, విద్యార్థులకు కలిసివచ్చింది.
మూడు మండలాల్లోనూ..
జిల్లాలోని మూడు మండలాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాజాపేట మండలంలో 12 జెడ్పీహెచ్ఎస్లుండగా 431 మంది , గుండాల మండలంలో 6 జెడ్పీహెచ్ఎస్లుండగా 251మంది, నారాయణపురం మండలంలో 6 జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలుండగా ఇందులో 402 మంది ఉన్నారు. వీరంతా ఉత్తీర్ణత సాధించారు.


