తిమ్మాపురం సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

తిమ్మాపురం సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు

Apr 6 2026 7:12 AM | Updated on Apr 6 2026 7:12 AM

అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని చాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్‌, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. కాగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్దన్‌, గణపురం నరేష్‌, బాలమురళీకృష్ణ, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఉప సర్పంచ్‌పై దాడి

హాలియా : భూ వివాదం కారణంగా గుర్రంపోడు మండలం చామలేడు గ్రామ ఉప సర్పంచ్‌ గుండెబోయిన చినపెద్దులుపై ఆదివారం అదే గ్రామానికి చెందిన బి. నర్సింహ దాడి చేశాడు. చినపెద్దులుకు, నర్సింహకు మధ్య భూ వివాదాలు నడుస్తున్నాయి. ఆదివారం చినపెద్దులు తన వ్యవసాయ బావి వద్దకు వెళ్తుండగా.. బి. నర్సింహ అతడిపై దాడి చేశాడు. దీంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement