పల్లెపోరుపై వీడిన ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

పల్లెపోరుపై వీడిన ఉత్కంఠ

Jun 26 2025 6:03 AM | Updated on Jun 26 2025 6:03 AM

పల్లెపోరుపై వీడిన ఉత్కంఠ

పల్లెపోరుపై వీడిన ఉత్కంఠ

సాక్షి, యాదాద్రి : మూడు నెలల్లో సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల క మిషన్‌ను ఆదేశించింది. స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతోపాటు సర్పంచ్‌ ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉన్నా జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అయితే గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రిజర్వేషన్లు కొనసాగుతాయా..లేక కొత్తగా చేస్తారా తేలాల్సి ఉంది.

ముందుగా పంచాయతీలకు..

గత ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ, జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, జనవరిలో మున్సిపాలిటీ పాలవర్గాల పదవీ కాలం ముగిసింది. అన్నింటికి ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 30లోపు గ్రామ పంచాయతీ పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికలు రెడీ అవుతోంది. అయితే ముందుగా పంచాయతీలకు, ఆ తర్వాత పార్టీ గుర్తుల మీద జరిగే స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి.

పోరుకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు

హైకోర్టు తీర్పులో జిల్లాలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలతోపాటు, సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నాయి. ఇందుకోసం అధికార కాంగ్రెస్‌ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీలోని కీలక నాయకులు ఇప్పటికే ఆశావహులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే గెలుపు గుర్రాలను దాదాపు ఖరారు చేసి పోరుకు సిద్ధంగా ఉండాలని సంకేతాలిచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్‌ కూడా గత ఎన్నికల మాదిరిగానే మెజార్టీ స్థానాలపై కన్నేసింది. బీజేపీ కూడా స్థానిక పోరుకు సిద్ధమవుతోంది. బలమైన అభ్యర్థులను బరిలో దింపి విజయం సాధించే పనిలో ఆ పార్టీ నాయకత్వం ఉంది. సీపీఎం, సీపీఐ పార్టీల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపే ప్రయత్నాలు సాగుతున్నాయి. సీపీఐ ఎంఎల్‌ న్యూడెమాక్రసీ పార్టీ సైతం తమకు గతంలో ఉన్న స్థానాలను నిలబెట్టుకునే పనిలో పడింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బరిలోకి దిగడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆశావహులు సై అంటున్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలయ్యేనా!

స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ల అంశంపై అన్ని రాజకీయ పార్టీల్లో చర్చ సాగుతోంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అమలు జరుగుతుందా లేదా అని ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్‌ పార్లమెంట్‌లో చట్టం కాలేదు కాబట్టి ఈ సారి అమలువుతుందో లేదో.. అయితే ఎంత మేరకు ఇస్తారో అనేది చర్చ మొదలైంది. అయితే పార్టీలే తాము ఇచ్చే టికెట్లలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కేటాయించే ప్రతిపాదన కూడా వస్తోంది. గత ఎన్నికలకు ముందు చేసిన చట్టం ప్రకారం రిజర్వేషన్‌ రెండు విడతలుగా ఉంటుంది. ప్రస్తుతం ఆ చట్టంపై ఎలాంటి మార్పు జరగలేదు. దీంతో గత ఎన్నికల్లో ఉన్న రిజర్వేషనే ఇప్పుడు కూడా అమలయ్యే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఫ సెప్టెంబర్‌ 30లోపు సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు

ఫ గ్రామాల్లో మొదలైన సందడి

ఫ బీసీ రిజర్వేషన్లపై సర్వత్రా చర్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement