
వర్షపాతం తక్కువే..!
గుండాల మండలం గంగాపురానికి చెందిన ఈ రైతు పేరు దూదిగామ నాగరాజు. రోహిణి కార్తెలో వర్షాలు పడడంతో తనకున్న రెండున్నర ఎకరాల్లో పత్తి గింజలు నాటారు. పత్తి గింజలకు రూ.7వేలు, దున్నకం ఖర్చు రూ.6,500, విత్తనాలు నాటిన కూళ్లు రూ.2,500తో కలిపి మొత్తం 16వేలు ఖర్చు చేశాడు. సకాలంలో వర్షాలు కురవక సగం విత్తనాలు కూడా మొలకెత్తలేదు. మొలకెత్తని వాటి స్థానంలో రెండోసారి విత్తనాలు విత్తేందుకు రూ.4,200, కూలీలకు రూ.1,500తో కలిపి రూ.5,700 ఖర్చుచేసేందుకు సిద్ధమయ్యాడు. మొత్తంగా రెండున్నర ఎకరాలకు రెండోసారి విత్తనాలు విత్తితే రూ.21,700 ఖర్చు వస్తుందని రైతు అంటున్నాడు.
ఈ రైతు పేరు కంబాల మహేందర్. ఈయనది అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం. తనకున్న మూడు ఎకరాల భూమిలో గత నెల 28న పత్తి విత్తనాలు నాటాడు. మూడు ఎకరాలకు గాను రూ.21వేలు పెట్టుబడి పెట్టాడు. నాటినుంచి వర్షం పడకపోవడంతో డ్రిప్ ఏర్పాటు చేసి తన వ్యవసాయ బోరు నుంచి రోజూ పత్తి చేనుకు నీరందిస్తున్నాడు. దీంతో 60 శాతం పత్తిచేను మొలకెత్తింది. ఈదురుగాలులు, ఎండలు కొడుతుండడంతో మొలకెత్తిన మొక్కల్లో 20 శాతం వాడిపోతున్నాయని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

వర్షపాతం తక్కువే..!