‘ఇచ్చంపల్లి–సాగర్‌’తో ఆర్థిక భారం | - | Sakshi
Sakshi News home page

‘ఇచ్చంపల్లి–సాగర్‌’తో ఆర్థిక భారం

Jun 24 2025 3:16 AM | Updated on Jun 24 2025 3:16 AM

‘ఇచ్చ

‘ఇచ్చంపల్లి–సాగర్‌’తో ఆర్థిక భారం

పోలవరం టు సాగర్‌ ప్రాజెక్టు

అనుకూలం

గోదావరి జలాలను పోలవరం నుంచి సాగర్‌ టెయిల్‌పాండ్‌కు తరలింవచ్చు

ఈ ప్రాజెక్టుతో ఖర్చు కూడా తక్కువ

తెలంగాణ రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం

నాగార్జునసాగర్‌: గోదావరి జలాలను కృష్ణాబేసిన్‌కు మళ్లించేందుకు ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్‌, పోలవరం–బనకచర్ల అనుసంధానం కన్నా పోలవరం నుంచి శ్రీశైలం జలాశయానికి అనుసంధానం చేసే పథకమే బాగుంటుందని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం పేర్కొంటోంది. ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌ జలాశయానికి అనుసంధానం చేసే పథకానికి సుమారు 350 కిలోమీటర్లకు పైచిలుకు పొడవు కాల్వ తవ్వాల్సి ఉంటుంది. కాల్వ లైనింగ్‌లతో కలిపితే సుమారు అరకిలో మీటరు వెడల్పులో భూసేకరణ చేయాల్సి ఉంటుంది. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ద్వారా ఆయకట్టుకు కేవలం ఒక టీఎంసీ నీటిని మాత్రమే తరలిస్తారు. గోదావరి నీటిని కృష్ణాబేసిన్‌కు మళ్లించే కాల్వలో రెండు టీఎంసీలకు పైచిలుకే నీటిని తరలించాలి. ఈ కాల్వ తవ్వకానికి గాను సుమారు 50వేల ఎకరాల భూసేకరణ చేయాలని ఇంజనీర్లు పేర్కొన్నారు. ఆ భూమంతా తెలంగాణలో ఇప్పటికే ఏదో ఒక ప్రాజెక్టు ద్వారానో, చెరువుల కిందనో బోరు బావుల ద్వారానో సేద్యమవుతూనే ఉంటుంది. భూసేకరణకు దాదాపు రూ.10వేల కోట్లు నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మరో రూ.20 వేల కోట్లకు పైచిలుకే ఖర్చు కానున్నట్లు అంచనా.

తెలంగాణ డిమాండ్లను అమలు చేశాకే గోదావరి నీరు బనకచర్లకు

గోదావరి నుంచి బనకచర్లకు 200టీఎంసీల నీటిని తరలించాలని ఆంధ్రప్రధేశ్‌ ప్రభుత్వం కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయానికి ప్రతిపాదనలు పంపింది. తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను అమలు చేశాకే బనకచర్లకు నీటి తరలింపు పనులు మొదలు కావాలని తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం డిమాండ్‌ చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలి నీటిని తరలంచాలని భావిస్తే ప్రజలలో తిరుగుబాటు వచ్చే అవకాశం లేకపోలేదు. గోదావరి ఉపనదులపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్నవి, భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలని డిమాండ్లలో పెట్టారు. పోలవరం నుంచి గోదావరి జలాలు 200టీఎంసీలు పెన్నా బేసిన్‌లోకి తరలించి సాగుకు వినియోగించే ప్రతిపాదన ఉన్నందున, అంతే నీటిని కృష్ణానదిలో తెలంగాణకు వాటాకు అదనంగా కేటాయించాలి. అన్ని అనుమతులు వచ్చాకే ఈ ప్రాజెక్టును చేపట్టాలి. డీపీఆర్‌ను గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) పరిశీలించి సాధ్యాసాధ్యాలను రిపోర్టు ఇచ్చిన తర్వాత సీడబ్ల్యూసీ నుంచి హైడ్రాలాజికల్‌ అనుమతి పొందాలి. అనంతరం అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం పొందాలని, అప్పుడే ప్రాజెక్టు మొదలు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే చేపట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక భారాన్ని తప్పించి, త్వరగా పూర్తి చేయాలని కోరారు. దీంతో పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ ఉదయ సముద్రం తదితర ప్రాజెక్టుకు నికరంగా జలాల కేటాయింపులు జరుగుతాయి. ఇదే విషయాలపై తెలంగాణ రిటైర్ల ఇంజనీర్లు త్వరలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.

పోలవరం – సాగర్‌ టెయిల్‌పాండ్‌తోనే తెలంగాణకు న్యాయం

పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌లోకి తరలించే పథకం ద్వారనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఇరు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయినందున కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేయాలన్నారు. ఈ నీటి తరలిపుతో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమకు సాగునీటిని అందించడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదిపై గల ప్రాజెక్టులకు, గోదావరి నదులపై గల ప్రాజెక్టులకు నికర జలాలు అందుతాయి. తక్కువ ఖర్చుతో ఉన్న వనరులను వినియోగించుకోని త్వరలో ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశాలుంటాయి. – మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి,

రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు

పోలవరంతో రోజుకు 3, 4టీఎంసీలు తరలించవచ్చు

పోలవరం ప్రాజెక్టు డైవర్షన్‌ ద్వారా సీజన్‌లో 100 రోజుల పాటు నీటి రాకను బట్టి 200 నుంచి 300 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌కు తరలించవచ్చు.అక్కడి నుంచి రివర్సబుల్‌ టర్బైన్ల ద్వారా నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు తక్కువ ఖర్చుతో నీటిని తరలించే అవకాశాలున్నట్లు తెలంగాణ ఇంజనీర్ల ఫోరం తెలిపింది. పోలవరం నుంచి ప్రస్తుతం కుడి కాల్వకు సమాంతరంగా మూడు నుంచి నాలుగు టీఎంసీల నీటిని మళ్లించేందుకు తాజా కాల్వను రూపొందించాలి. ఎటువంటి భూసేకరణ లేకుండానే కృష్ణానదికి 300 టీఎంసీల గోదావరి జలాలను తరలించవచ్చు. 2019లోనే తెలంగాణ, ఆంధ్రప్రధేశ్‌ ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల ఇంజనీర్లు, అధికారులతో కలిసి రెండు సమావేశాలు నిర్వహించారు. దక్షిణ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లోని రాయలసీమలో సాగునీటి కొరత తీర్చేందుకు గోదావరి నీటిని కృష్ణానది జలాశయాల్లోకి మళ్లించడం గురించి చర్చించారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు కేవలం రూ.25,000కోట్లు మాత్రమేనని అంచనా వేశారు.

‘ఇచ్చంపల్లి–సాగర్‌’తో ఆర్థిక భారం1
1/2

‘ఇచ్చంపల్లి–సాగర్‌’తో ఆర్థిక భారం

‘ఇచ్చంపల్లి–సాగర్‌’తో ఆర్థిక భారం2
2/2

‘ఇచ్చంపల్లి–సాగర్‌’తో ఆర్థిక భారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement