లక్కీ డ్రా స్కీం పేరుతో మోసం | - | Sakshi
Sakshi News home page

లక్కీ డ్రా స్కీం పేరుతో మోసం

Jun 24 2025 3:16 AM | Updated on Jun 24 2025 3:16 AM

లక్కీ డ్రా స్కీం పేరుతో మోసం

లక్కీ డ్రా స్కీం పేరుతో మోసం

మిర్యాలగూడ: ‘ప్రతి నెలా రూ.1000 కట్టు.. నెల చివరలో తీసే లక్కీ డ్రాలో ప్రైజ్‌ కొట్టు’ అంటూ ఓ ప్రైవేట్‌ సంస్థ నిర్వాహకులు అమాయక ప్రజలను నిండాముంచారు. మిర్యాలగూడ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ మోసంపై బాధితులు, మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్‌కే ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట మిర్యాలగూడకు చెందిన కె. రమేష్‌, కె. కోటేశ్వర్‌రావు, బచ్చలకూరి శ్రీనివాస్‌ లక్కీ డ్రా స్కీం ఏర్పాటు చేశారు. వారి వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఏజెంట్లను కూడా నియమించుకున్నారు. మిర్యాలగూడతో పాటు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, నేరేడుచర్ల , ఏపీ సరిహద్దు గ్రామాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని సభ్యులను చేర్చుకున్నారు. ఈ స్కీంలో చేరిన ఒక్కో సభ్యుడి నుంచి 15నెలల పాటు ప్రతి నెలా రూ.1000 చొప్పున వసూలు చేశారు. ఇలా 2600 మందిని సభ్యులుగా చేర్చుకుని ప్రతి నెలా డ్రా తీసి 10మందికి రూ.15వేల విలువైన వస్తువులను అందజేస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ లక్కీ డ్రా స్కీం ఈ ఏడాది జనవరిలో ముగిసింది. ఇప్పటి వరకు 150మందికి డ్రా పద్ధతిలో వస్తువులు అందజేసిన నిర్వాహకులు ఆ తర్వాత స్కీంను అర్ధాంతరంగా ఎత్తివేశారు. గత ఆరునెలలుగా నిర్వాహకులు పత్తా లేకపోవడంతో స్కీంలో చేరిన సభ్యులు వారి కోసం ఆరా తీశారు. వారిని సభ్యులుగా చేర్పించిన ఏజెంట్లను నిలదీయడంతో తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈ స్కీం పేరిట ఇప్పటివరకు 2600మంది సభ్యుల నుంచి రూ.4 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. చివరి నెల డ్రాలో కారు ఇస్తామని నిర్వాహకులు చెప్పినట్లు బాధితులు తెలిపారు. స్కీంలో చెప్పిన విధంగా చెల్లింపులు చేయకపోవడం, బంపర్‌ డ్రా తీయకపోవడంతో మిర్యాలగూడ పట్టణం కలల్‌వాడకు చెందిన మొరుగు వెంకటమ్మ అనే మహిళ తనను సభ్యురాలిగా చేర్పిన మందారి మల్లేశ్వరి, స్కీం నిర్వాహకుడు కె. రమేష్‌పై వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన బాధితులు కూడా సోమవారం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఒక్క మిర్యాలగూడ పట్టణంలోనే 900 మంది బాధితులున్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్‌ సీఐ మోతీరాం తెలిపారు.

2600 మంది నుంచి

రూ.4కోట్లకు పైగా వసూలు

బాధితుల ఫిర్యాదు మేరకు

కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement