
దొంగతనం కేసులో ఐదుగురి అరెస్ట్
సూర్యాపేటటౌన్: దొంగతనం కేసులో ఐదుగురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. డీఎస్పీ విలేకరులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. నాగారం మండలం ఈటూరు గ్రామానికి చెందిన బోడ వెంకటేష్ మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లిలో నివాసముంటూ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈటూరు గ్రామానికే చెందిన నంగునూరి బయ్యమ్మ కుటుంబ సభ్యులు ఉపాధి నిమిత్తం తమిళనాడు రాజధాని చైన్నెలో స్థిరపడ్డారు. బయ్యమ్మ గ్రామంలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె భూమిని బోడ వెంకటేష్ మామ యాల రమేష్ కౌలుకు చేస్తున్నాడు. దీంతో అప్పుడప్పుడు రమేష్తో పాటు వెంకటేష్ కూడా బయ్యమ్మ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో బయ్యమ్మ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కాజేయాలని వెంకటేష్ నిర్ణయించుకున్నాడు. ఈ నెల 17వ తేదీ రాత్రి వెంకటేష్తో పాటు తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన అతడి స్నేహితుడు పోతరాజు నాగరాజు, అడ్డగూడూరు మండలం కాంచనపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల చంద్రశేఖర్, నాగారం మండలం మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొమ్ము సోమయ్య, వడ్డె పున్నం కలిసి కారులో హైదరాబాద్ నుంచి ఈటూరుకు వచ్చారు. బయ్యమ్మ ఒక్కతే ఇంట్లో నిద్రిస్తుండగా.. ఆమె ఇంటి వెనక నుంచి గోడ దూకి తమ వెంట తెచ్చుకున్న కట్టర్తో కరెంట్ కట్ చేశారు. వెంకటేష్ను బయ్యమ్మ గుర్తుపడుతుందని భావించి మిగతా నలుగురు వెళ్లి ఆమెను గట్టిగా పట్టుకొని చీరతో చేతులు కట్టేశారు. ఆమె మెడలోని నల్లపూసల గొలుసు, చేతి గాజులతో పాటు ఇళ్లంతా వెతికి దొరికిన డబ్బులతో అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే చోరీ చేసిన సొత్తును విక్రయించేందుకు సోమవారం నిందితులు కారులో వెళ్తుండగా.. నాగారం సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది తిరుమలగిరిలో వారిని పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి కారు, నల్లపూసల గొలుసు, ఐదు సెల్ఫోన్లు, కట్టర్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో నాగారం సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.