
నంబర్లు మార్చి.. నయా దందా!
మిర్యాలగూడ : గడువుతీరిన వాహనాలను స్ప్రాప్ కింద తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రమాదానికి గురైన వాహనాల ఇంజిన్, చాసిస్ నంబర్లను వీటికి మార్చి అధిక ధరలకు విక్రయిస్తున్న విషయం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో వెలుగు చూసింది. హైదరాబాద్లో చోరీకి గురైన ఒక కారును మిర్యాలగూడ పట్టణంలోని మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఇటీవల ఆంధ్రాలో కొనుగోలు చేశారు. ఈ కారును మిర్యాలగూడలోని ఓ కారు షెడ్డులో మరమ్మతు చేయిస్తుండగా కారు జీపీఎస్ ఆన్ అయ్యింది. రెండేళ్ల క్రితం హైదరాబాద్లో కారు చోరీకి గురైనట్లు యజమాని అక్కడ ఫిర్యాదు చేశాడు. కారు జీపీఎస్ను ఆధారం చేసుకొని మిర్యాలగూడకు వచ్చిన సదరు యజమాని.. విషయాన్ని పోలీసులకు తెలిపాడు. కారు ఇంజన్ నంబర్, చాసిస్ నంబర్ మార్చి ఉన్నట్లుగా గుర్తించిన మెకానిక్.. విషయాన్ని పోలీసులకు వివరించాడు. దీంతో కారు ఎక్కడ కొనుగోలు చేశారో, ఎవరు అమ్మారో చెప్పాలని పోలీసులు మిర్యాలగూడకు చెందిన వ్యక్తిని ప్రశ్నించారు. ఆయన చెప్పిన వ్యక్తి ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారైనట్లు తెలిసింది.
చాసిస్ నంబర్లు మార్చి
అధిక ధరలకు విక్రయాలు
సదరు కారు నంబర్ ఎవరు మార్చారు.. ఎలా మార్చారనే విషయాన్ని విచారణ చేసే క్రమంలో మిర్యాలగూడకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకొచ్చి ప్రశ్నించారు. దీంతో తాను ఈ కారు నంబర్, చాసిస్ నంబర్ మార్చలేదని.. కానీ, పట్టణంలోని ఒక పార్కింగ్ యార్డు యజమాని పంపించిన మూడు కార్లకు మాత్రం ఇంజన్, చాసిస్ నంబర్లను మార్చినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. కాగా ఆ పార్కింగ్ యార్డులో 60 రోజుల సీసీ టీవీ ఫుటేజీ అందుబాటులో ఉంటుందని, పోలీసులు ఈ ఫుటేజీని పరిశీలిస్తే ఇలాంటి కార్లు ఎన్ని ఉన్నాయో వెలుగు చూసే అవకాశం ఉంది. పోలీసు ఉన్నతాధికారులు ఈ అక్రమ దందాపైన ప్రత్యేక నిఘా పెట్టి కూపీ లాగితే సంచలన విషయాలు బయటపడనున్నాయి. సుమారు నాలుగేళ్ల క్రితం ఢిల్లీ, పాండిచ్చేరికి చెందిన సుమారు 20 వాహనాలను తెలంగాణకు తీసుకొచ్చి ఇదే రీతిలో విక్రయాలు జరిపిన ముఠా గుట్టును అప్పటి పోలీసులు ఛేదించారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టి ప్రత్యేక విచారణ జరిపితే అక్రమ దందా గుట్టు బయటపడుతుంది.
బీఎస్–3 వాహనాలను
తక్కువ ధరకు కొనుగోలు
మిర్యాలగూడలోని కారు గురించి కూపీ లాగడంతో బీఎస్–3 వాహనాల దందా కూడా బయటపడింది. 2019లో భారత ప్రభుత్వం నిర్ణీత గడువు తీరిన తరువాత బీఎస్–3 కార్లను విక్రయించవద్దని ఆదేశాలు జారీచేసింది. దీంతో షోరూమ్ల యజమానులు చాసిస్, ఇంజన్ నంబర్లను తొలగించి వాటిని స్క్రాప్ కింద విక్రయించినట్లు సమాచారం. ఈ కార్లను అతి తక్కువ ధరలకు స్క్రాప్ కింద కొనుగోలు చేసుకుని రోడ్డు ప్రమాదాల్లో ధ్వంసమైన కార్ల ఇంజన్, చాసిస్ నంబర్లను అమర్చి బీఎస్–3 వాహనాలను అధిక ధరలకు విక్రయించుకుంటున్నారు. ఈ దందా భారీగానే కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ విధంగా ఎన్ని వాహనాలకు నంబర్లు మార్చారు.. ఎన్ని కార్లను అధిక ధరలకు విక్రయించారనే కోణంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
బీఎస్–3 కార్లకు ఇంజన్, చాసిస్ నంబర్లు మార్పు
ఫ ప్రమాదాల్లో ధ్వంసమైన కార్ల
నంబర్లు వేసి విక్రయాలు
ఫ చోరీకి గురైన కారు యజమాని
ఫిర్యాదుతో బయటపడ్డ వ్యవహారం
సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం
బీఎస్–3 వాహనాలకు ఇంజన్, చాసిస్ నంబర్లను మార్చి విక్రయాలు జరుపుతున్న వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నాం. ఈ విషయంలో దోషులు ఎంతటివారైనా ఉపేక్షించం. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నాం. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్రం ఎంత.. వాహనాలను కొనుగోలు చేసిన వారు, వాహనాలను విక్రయించిన ప్రధాన సూత్రధారి ఎవరన్న విషయాలు త్వరలోనే గుర్తిస్తాం.
– రాజశేఖర్రాజు, డీఎస్పీ, మిర్యాలగూడ