యువకుడిపై దాడి.. కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

యువకుడిపై దాడి.. కేసు నమోదు

May 31 2025 1:20 AM | Updated on May 31 2025 3:37 PM

గరిడేపల్లి: దారివ్వమని అడిగినందుకు యువకుడిపై దాడి చేసిన ఘటనలో శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ చలికంటి నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండల పరిధిలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన దుపాటి మోహన్‌ హుజూర్‌నగర్‌ పట్టణంలో డిగ్రీ పరీక్షలు రాసి తిరిగి బైక్‌పై ఇంటికి వస్తున్నాడు. మార్గమధ్యంలో గ్రామానికి చెందిన మామిడి రమేష్‌ ఇంటి ముందుకురాగానే మండలంలోని రాయినిగూడెం గ్రామానికి చెందిన సిద్ధు, హుజూర్‌నగర్‌ పట్టణానికి చెందిన సంపత్‌, జీవన్‌, నరేష్‌, మాధవరాయినిగూడెం గ్రామానికి చెందిన కాటబోయిన విష్ణు, నిమ్మల విష్ణు మరికొంత మంది యువకులు డీజే పాటలు పెట్టుకుని డ్యాన్స్‌ చేస్తున్నారు. వారిని దారి ఇవ్వమని అడిగినందుకు మోహన్‌పై దాడి చేసి గాయపర్చారు. ఈమేరకు మోహన్‌ తల్లి దుపాటి నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శుక్రవారం తెలిపారు.

డీజే నిర్వాహకుడిపై కేసు

గరిడేపల్లి: మండల పరిధిలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన గణేష్‌ వివాహం సందర్భంగా అనుమతి లేకుండా డీజే పెట్టినందుకు డీజే నిర్వాహకుడు, వాహనం సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ చలిగంటి నరేష్‌ శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి కాల్వపల్లి గ్రామంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా చనగాని నర్సింహరావు అనుమతి లేకుండా డీజే నిర్వహిస్తుండడంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

వంట గ్యాస్‌ పైపు లీకేజీ

సంస్థాన్‌ నారాయణపురం: మండల కేంద్రంలో శుక్రవారం ఇంటిలో వంట గ్యాస్‌ పైపు లీకేజీ కావడంతో మంటలు అంటుకున్నాయి. మండల కేంద్రానికి చెందిన కర్నాటి పాండు ఇంట్లో కుటుంబసభ్యులు వంట చేస్తుండగా స్టౌవ్‌కు ఉన్న పైపు వద్ద గ్యాస్‌ లీకేజీ అయి మంటలు వచ్చాయి. అందోళన చెంది బస్తాలు కప్పడంతో బస్తాకు మంటలు అంటుకుని పొగ అలుముకుంది. పోలీసులు, ఫైర్‌ స్టేషన్‌ అధికారులు అక్కడకు చేరుకున్నారు. తడి బస్తాలు కప్పి మంటలు ఆర్పివేశారు. రెగ్యులేటర్‌ ఆఫ్‌ చేసి, సిలిండర్‌ను ఇంటి నుంచి బయటకు తీసుకురావడంతో ప్రమాదం తప్పింది.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

మఠంపల్లి: మండలంలోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన గోపిశెట్టి లక్ష్మీనారాయణ(28) శుక్రవారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనారాయణ స్థానికంగా మిషన్‌ భగీరథ మంచినీటి సరఫరా విభాగంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గ్రామ పరిధిలో గల తన వ్యవసాయ పొలంలో నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. విద్యుత్‌ మోటార్‌ ఆన్‌ చేస్తే పనిచేయలేదు. ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని భావించి ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలిస్తుండగా.. ప్రమాదవశాత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ వైరు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్యా, ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మఠంపల్లి పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement