
గొర్రెలకు పొంచి ఉన్న చిటుకు వ్యాధి ముప్పు
త్రిపురారం: గొర్రెలకు సోకే వ్యాధుల్లో చిటుకు వ్యాధి అత్యంత ప్రమాదకరమైంది. ఈ వ్యాధిని నెత్తి పిడుగు, గడ్డి రోగం, పాటు రోగం వంటి పేర్లతో పిలుస్తుంటారు. గొర్రెలు తొలకరి వర్షాలకు మొలిచిన గడ్డిని ఎక్కువగా తినడం వల్ల చిటుకు వ్యాధి సోకుతుంది. బలిష్టంగా పెరిగి యుక్త వయసులో ఉన్న గొర్రెలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేత కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లె గొర్రెల్లో ఈ వ్యాధి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి నివారణకు గొర్రెల పెంపకందారులు సకాలంలో జాగ్రత్తలు పాటిస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చని త్రిపురారం మండల పశువైద్యాధికారి నాగేందర్ సూచిస్తున్నారు.
తొలకరిలో లేత గడ్డి తినడం వలన..
తొలకరి వర్షాలకు పొలాలు, గట్లపై పెరిగిన లేత గడ్డిని గొర్రెలు ఇష్టంగా తింటాయి. తద్వారా క్లాస్రీడీయం ఫర్ ఫ్రిస్జర్స్ టైప్–డీ రకం సూక్ష్మజీవులు జీవాల పేగుల్లో గాలి లేని వాతావరణంలో అభివృద్ధి చెందుతాయి. ఈ సూక్ష్మజీవులు వదిలిన విష పదార్థాలు చిటుకు వ్యాధికి కారణమవుతాయి. మే నెల ఆఖరు నుంచి జూలై నెల మధ్యలో ఈ వ్యాధి ఎక్కువగా గొర్రెలకు సోకుతుంది. ఈ వ్యాధి సోకిన గొర్రెలు ఎగిరి కిందపడి కాళ్లు గిలగిల కొట్టుకుంటూ, పళ్లు కొరుకుతూ బిగుసుపోయి ప్రాణాలు కోల్పోతాయి. వ్యాధి సోకిన జీవాలు మేత మేకపోవడం, నెమరు వేయకపోవడం, తలలు వాల్చి ముడుచుకొని ఒకే చోట నిలబడతాయి. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స చేయించాలి.
నివారణ మార్గాలు
జీవాలకు ప్రతి యేటా ఏప్రిల్, మే నెల మధ్యలో వ్యాధి నిరోధక టీకా (మల్టీకాంపోనెంట్ ఈటీ వ్యాక్సిన్) తప్పనిసరిగా వేయించాలి. రెండో విడత అక్టోబర్, నవంబర్ నెలల్లో వేయించాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని పశు వైద్యులను సంప్రదించాలి. తొలకరి వర్షాలకు మొలిచిన, వాడిపోయిన గడ్డిని జీవాలు మేయకుండా జాగ్రత్తలు పాటించాలి. గొర్రెలను ఉదయం కొంచెం ఆలస్యంగా మేతకు తీసుకెళ్లాలి. మధ్యాహ్నం చెట్ల కింద కాస్త విశ్రాంతి తీసుకునే విధంగా చూడాలి. సాయంత్రం ఎక్కువ సేపు పొలంలో ఉండకుండా దొడ్లలోకి తీసుకెళ్లాలి. వ్యాధి సోకిన గొర్రెలను మందలకు దూరంగా ఉంచాలి. ఇలాంటి జాగ్రత్తలతో చిటుకు వ్యాధి సోకకుండా చూసుకోవడంతో పాటు వ్యాధి బారిన పడిన జీవాలను కాపాడుకోవచ్చు.
ముందస్తుగానే ఎంట్రో టాక్సీనియా టీకా వేయించాలి
త్రిపురారం మండల
పశువైద్యాధికారి నాగేందర్ సూచన

గొర్రెలకు పొంచి ఉన్న చిటుకు వ్యాధి ముప్పు