
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మేళ్లచెరువు: బైక్పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన గురువారం మేళ్లచెరువు మండల పరిధిలోని కందిబండ గ్రామ సమీపంలో జరిగింది. ఎస్ఐ పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన నాగులు(45) పని నిమిత్తం బైక్పై గురువారం మేళ్లచెరువుకు వస్తుండగా.. కందిబండ సమీపంలో గుర్తుతెలియని వాహనం అతడి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగులును స్థానికులు 108 వాహనంలో కోదాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య రహీనాబేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
విద్యుదాఘాతంతో..
రామన్నపేట: ఇంట్లో సంపు మోటారు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతిచెందింది. ఈ ఘటన గురువారం రామన్నపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి చెందిన అనిత(33)కు రామన్నపేటకు చెందిన జూకంటి మహేష్తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. మహేష్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అనిత గురువారం ఉదయం ఇంట్లో నీటి సంపు మోటారును ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. మృతురాలి భర్త మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి. మల్లయ్య తెలిపారు.
పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత
చౌటుప్పల్: అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని గురువారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడలోని పశువుల సంత నుంచి కొనుగోలు చేసిన ఐదు గోవులు, ఆరు ఎద్దులను ప్రత్యేక వాహనంలో హైదరాబాద్కు తరలిస్తుండగా.. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని తంగడపల్లి క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. కోదాడకు చెందిన వాహన డ్రైవర్ షేక్ అషీమ్, కొండ వీరకృష్ణ, కుంబజాడ సాయిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. పట్టుబడిన గోవులు, ఎద్దులను గోశాలకు తరలించినట్లు పేర్కొన్నారు.
మునగాలలో..
మునగాల: అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని గురువారం ఉదయం విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై మునగాల మండలం మొద్దులచెరువు గ్రామ స్టేజీ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ బి. ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మొద్దులచెరువు గ్రామ స్టేజీ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. కోదాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనంలో రెండు ఎద్దులు, ఆరు ఆవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి హైదరాబాద్లోని జియాగూడ గోశాలకు తరలించామన్నారు. కోదాడ పట్టణానికి చెందిన షేక్ ఖాజామోయినుద్దీన్, వాహన డ్రైవర్ అనిల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం