
ఉపాధి పనుల్లో విద్యావంతులు
పలువురు మాజీ ప్రజాప్రతినిధులు సైతం కరువు పనికి..
డిగ్రీలు, పీజీలు చేసిన విద్యావంతులతో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు సైతం ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఖాళీ సమయాల్లో, మరికొందరు ఉన్నత ఉద్యోగాలు రాక పలుగు, పార పట్టుకుంటున్నారు. మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీపీలు సైతం లాభాపేక్ష లేకుండా రాజకీయాలు చేసి ఇప్పుడు కుటుంబ పోషణ కోసం ఉపాధి కూలీలుగా మారారు.
చదువుల ఖర్చు కోసం..
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహడ్ గ్రామానికి చెందిన మచ్చ వాణి డీఎంఎఫ్టీ నర్సింగ్ పూర్తి చేసింది. ప్రస్తుతం గ్రామంలో జరిగే ఉపాధి పనులకు ప్రతిరోజు వెళ్తోంది. చదువుల ఖర్చు వెళ్లదీసుకోవడానికి ఉపాధి పనులకు వెళుతున్నట్లు ఆమె పేర్కొంది. ఖాళీ సమయాల్లో ఉపాధి పనులకు వెళ్లి ఆ తర్వాత చదువుకుంటున్నట్లు ఆమె చెప్పారు.
పీజీ ఎగ్జామ్కు సన్నద్ధమవుతూ..
తిప్పర్తి: తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని నూకలవారిగూడేనికి చెందిన తండు సైదులు డిగ్రీ పూర్తిచేసి గ్రూప్స్కు పరీక్షలు రాశాడు. పీజీ చేసేందుకు సన్నద్ధమవుతూ ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాడు. ఈ సీజన్లో వారం పాటు పనులకు వెళ్లాడు. గత సీజన్ మొత్తం ఉపాధి హామీ పనులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూనే..
అర్వపల్లి: ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తూనే వేసవి సెలవుల్లో ప్రతిరోజు ఉపాధి పనికి వెళ్తున్నారు జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని కాసర్లపహడ్ గ్రామానికి చెందిన మట్టిపల్లి సతీష్, ఎంఎస్సీ పూర్తిచేశారు. ఉదయం వేళ ఉపాధి పనికి వెళ్లి ఆ తర్వాత ఇతర పనులు చేసుకుంటానని సతీష్ పేర్కొన్నారు.

ఉపాధి పనుల్లో విద్యావంతులు

ఉపాధి పనుల్లో విద్యావంతులు