
గంజాయి సాగుచేస్తున్న నలుగురి అరెస్ట్
పెద్దఅడిశర్లపల్లి: గంజాయి సాగుచేస్తున్న నలుగురు వ్యక్తులను గుడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్ వద్ద గుడిపల్లి పోలీస్ స్టేషన్లో దేవరకొండ ఏఎస్పీ మౌనిక విలేకరులకు వెల్లడించారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మట్టూరు గ్రామానికి చెందిన దెరగుంల సింగరావు కొండమల్లేపల్లిలో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల గ్రామ శివారులో గల నాగిళ్ల పాండరయ్య వ్యవసాయ భూమిని పిల్లిగుంటతండాకు చెందిన ఇస్లావత్ చందూతో కలిసి సింగరావు కౌలుకు తీసుకున్నారు. పండ్ల వ్యాపారంలో భాగంగా సింగరావుకు నాంపల్లి మండలం బండతిమ్మాపురం గ్రామానికి చెందిన కొత్తగొల్ల శ్రీను పరిచయమయ్యాడు. సింగరావుకు శ్రీను కొన్ని గంజాయి విత్తనాలు ఇచ్చి వాటి మొక్కలుగా పెంచి ఇస్తే డబ్బులు ఇస్తానని చెప్పడంతో కౌలుకు తీసుకున్న భూమిలో సింగరావు గంజాయి విత్తనాలు నాటాడు. అవి మొక్కలుగా పెరిగిన తర్వాత శ్రీనుకు ఇచ్చాడు. శ్రీను రూ.5 వేలు సింగరావుకు ఇవ్వగా అందులో నుంచి రూ.2 వేలు చందూకు ఇచ్చాడు. శ్రీనుతో పాటు రేవల్లి గ్రామానికి చెందిన వంగూరి శివ కలిసి గంజాయి మొక్కలను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. ఇదే క్రమంలో శ్రీను తిరిగి సింగరావుకు 30 గంజాయి విత్తనాలు ఇవ్వగా చందూతో కలిసి కౌలుకు తీసుకున్న భూమిలో నాటారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తన సిబ్బందితో కలిసి సింగరావు కౌలుకు తీసుకున్న వ్యవసాయ భూమిపై దాడి చేసి 30 గంజాయి మొక్కలు, బైక్, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. సింగరావుతో పాటు చందూ, శ్రీను, శివను అరెస్ట్ చేశారు. నిందితులను పట్టుకున్న కొండమల్లేపల్లి ఇన్చార్జి సీఐ రాజు, గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు, కొండమల్లేపల్లి ఎస్ఐ రమేష్, పోలీస్ సిబ్బంది గురువారెడ్డి, హట్టి, ఏడుకొండల్, రామకృష్ణ, శివ, మౌనిక, రవి, యాదగిరి, లింగయ్య, ఆనంద్ను ఏఎస్పీ అభినందించారు.
30 గంజాయి మొక్కలు, బైక్,
4 సెల్ఫోన్లు స్వాధీనం