తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి | - | Sakshi
Sakshi News home page

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి

May 29 2025 10:06 AM | Updated on May 29 2025 10:06 AM

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి

మద్దిరాల: తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మి కుడు మృతిచెందాడు. ఈ ఘటన మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలుమల్ల గ్రామానికి చెందిన గీత కార్మికుడు తునికి వెంకన్న రోజుమాదిరిగానే బుధవారం ఉదయం తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య తునికి లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ ఎం.వీరన్న తెలిపారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కనగల్‌, రామగిరి(నల్లగొండ): బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి చెట్టును ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ మండలం జి. చెన్నారం గ్రామ స్టేజీ వద్ద బుధవారం చోటు చేసుకుంది. కనగల్‌ ఎస్‌ఐ పి. విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం ముశంపల్లికి చెందిన తవుడోజు వెంకటాచారి(45) నల్లగొండ పట్టణంలోని శాంతినగర్‌లో నివాసముంటున్నాడు. మర్రిగూడ బైపాస్‌లోని ఓ లాడ్జిలో మేనేజర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన మేనకోడలి వివాహ పత్రికలు పంచేందుకు బుధవారం బైక్‌పై కనగల్‌ మండలం దర్వేశిపురం వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా జి. చెన్నారం గ్రామ స్టేజీ వద్ద బైక్‌ అదుపుతప్పడంతో రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటాచారి అక్కడికక్కడే మృతిచెందాడు. సమచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

డివైడర్‌ను ఢీకొని..

వేములపల్లి: రోడ్డు డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా పడడంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన వేములపల్లి మండల శివారులో నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం కొండ్రపోల్‌ గ్రామానికి చెందిన నామిరెడ్డి అరవింద్‌రెడ్డి (25) తన కారులో రాత్రి హైదరాబాద్‌కు బయల్దేరాడు. మార్గమధ్యలో వేములపల్లి మండలం శెట్టిపాలెం శివారులోని చిత్రపరక వాగు సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అరవింద్‌రెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో అరవింద్‌రెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement