
న్యాయమైన పరిహారం చెల్లిస్తాం
భువనగిరిటౌన్ : గంధమల్ల రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం న్యా యమైన పరిహారం అందజేస్తుందని, ఆందోళన చెందవద్దని అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్లో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి గంధమల్ల రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 14 మంది రైతులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఎంతోకాలంగా భూమిని నమ్ముకుని బతుకుతున్నామని, వ్యవసాయమే తమకు జీవనాధారం అన్నారు. తాము రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకం కాదని, కాకపోతే భూములకు బహిరంగ మార్కెట్లో చాలా విలువ ఉందని, న్యాయమైన పరిహారం చెల్లించాలని కోరారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందవద్దని, తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.