నేతన్న రుణమాఫీకి ముందడుగు | - | Sakshi
Sakshi News home page

నేతన్న రుణమాఫీకి ముందడుగు

May 4 2025 6:33 AM | Updated on May 4 2025 6:33 AM

నేతన్

నేతన్న రుణమాఫీకి ముందడుగు

భూదాన్‌పోచంపల్లి: చేనేత కార్మికుల రుణమాపీకి ముందడుగు పడింది. అసలు, వడ్డీ కలుపుకొని రూ.లక్ష లోపు ఉన్న చేనేత రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం రెండు నెలల క్రితం జీఓ నంబర్‌ 56ను జారీ చేసింది. రుణమాపీ కోసం రూ.33 కోట్ల నిధులను మంజూరు చేసింది. కానీ రుణమాఫీ విధివిధానాలు ఖరారు కాకపోవడంతో రెండు నెలలుగా రుణమాపీ ప్రక్రియ మొదలుకాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు రుణమాఫీ చేస్తారని కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు రాష్ట్ర చేనేత, జౌళిశాఖ రుణమాఫీ అమలుకు రెండు రోజుల క్రితం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రక్రియను పూర్తిచేసి జూన్‌ నెలాఖరు వరకు చేనేత కార్మికుల బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు జమచేసేలా కసరత్తు చేస్తోంది.

మార్గదర్శకాలు ఇవే..

రుణాలు పొందిన కార్మికుల జాబితాను చేనేత, జౌళిశాఖ ఏడీలు బ్యాంకుల వారీగా తీసుకుంటారు. వాటిని జిల్లాల వారీగా క్లెయిమ్‌లను తయారుచేసి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీలో సభ్యులుగా ఉండే డీసీసీబీ సీఈఓ, చేనేతశాఖ ఆర్‌డీడీ, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌, నాబార్డు డీజీఎం, పరిశ్రమల శాఖ జీఎం, జిల్లా సహకార అధికారుల ఆమోదం అనంతరం రాష్ట్రస్థాయి కమిటీకి ప్రతిపాదిస్తారు. చేనేత, జౌళిశాఖ డైరెక్టర్‌ అధ్యక్షత వహించే రాష్ట్రస్థాయి కమిటీలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, టెస్కాబ్‌, నాబార్డు రాష్ట్రస్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లాస్థాయి నుంచి వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదించిన తర్వాత రుణమాఫీ మొత్తం ఆయా చేనేత కార్మికుల ఖాతాల్లో జమవుతుంది. అనంతరం బ్యాంకర్లు బకాయిలు లేవని నో డ్యూ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. రుణమాఫీ అనంతరం కార్మికులు కోరుకుంటే తిరిగి బ్యాంకులు రుణాలు జారీ చేస్తారు.

2024 మార్చి 31 వరకు ఉన్న రుణాలకే వర్తింపు..

2017 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 31 వరకు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికే ఈ రుణమాఫీ వర్తిస్తుంది. వృత్తి పనిచేస్తున్న చేనేత కార్మికులు తీసుకున్న వ్యక్తిగత రుణాలు, చేనేత వస్త్రాల ఉత్పత్తికి, వృత్తి సంబంధ కార్యకలాపాలు, ముద్ర రుణాలన్నింటిని మాఫీ చేయనుంది.

ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారులు..

యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న 1162 మందికి రూ.8.04కోట్ల రుణమాఫీ జరుగనుంది. అందులో భూదాన్‌పోచంపల్లిలో 234 మంది కార్మికులకు రూ.1,17,82,200 రుణమాఫీ కానుంది. అదేవిధంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి 670 మంది చేనేత కార్మికులకు గాను రూ.4.90 కోట్లు రుణమాఫీ లబ్ధి చేకూరనుంది.

రూ.లక్ష లోపు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల

ఉమ్మడి జిల్లాలో 1832 మంది చేనేత

కార్మికులకు రూ.12.94 కోట్ల లబ్ది

ప్రక్రియ మొదలుపెడతాం

మార్గదర్శకాలు అందిన వెంటనే చేనేత రుణమాఫీ ప్రక్రియను మొదలుపెడతాం. గతంలో రూ.2లక్షల లోపు ఉన్న కార్మికుల జాబితాను బ్యాంకర్ల నుంచి తీసుకొని ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణమాఫీ చేస్తున్నందున తిరిగి రూ.లక్ష లోపు రుణాలు ఉన్న కార్మికుల జాబితాను రూపొందించి జిల్లాస్థాయి కమిటీ ఆమోదించిన తర్వాత రాష్ట్రస్థాయి కమిటీకి పంపిస్తాం. అక్కడ ఆమోదం పొందిన వెంటనే కార్మికుల ఖాతాలో డబ్బులు జమవుతాయి.

– శ్రీనివాస్‌, చేనేత, జౌళిశాఖ ఏడీ,

యాదాద్రి భువనగిరి జిల్లా

సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లాం

ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.లక్ష లోపు రుణమాఫీ చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసినందుకు సంతోషం. చేనేత కార్మికుల రుణమాఫీ అమలుకై స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ద్వారా పలుమార్లు మంత్రి తుమ్మల నాగేశ్వరారవు దృష్టికి తీసుకెళ్లాం. వచ్చే నెలాఖరు వరకు కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల పక్షాన సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. – తడక వెంకటేశం, చేనేత కార్మిక

సంఘం రాష్ట్ర నాయకుడు

నేతన్న రుణమాఫీకి ముందడుగు1
1/2

నేతన్న రుణమాఫీకి ముందడుగు

నేతన్న రుణమాఫీకి ముందడుగు2
2/2

నేతన్న రుణమాఫీకి ముందడుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement