స్వర్ణగిరీశుడికి వసంతోత్సవ సేవ | - | Sakshi
Sakshi News home page

స్వర్ణగిరీశుడికి వసంతోత్సవ సేవ

May 4 2025 6:33 AM | Updated on May 4 2025 6:33 AM

స్వర్

స్వర్ణగిరీశుడికి వసంతోత్సవ సేవ

భువనగిరి: భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రంలో శనివారం శ్రీవేంకటేశ్వరస్వామికి వసంతోత్సవ సేవ నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్య కల్యాణం నిర్వహించారు. మధ్యాహ్నం 4500 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, సహస్ర దీపాలంకరణ, మంగళహారతులు సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

మంటల్లో బైక్‌ దగ్ధం

చింతపల్లి: మంటల్లో బైక్‌ దగ్ధమైన ఘటన చింతపల్లి మండలం కిష్టరాయనిపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టరాయనిపల్లి గ్రామానికి చెందిన మోర శ్రీరాములు తన పల్సర్‌ బైక్‌ను రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి తన ఇంటి పక్కనే ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పార్కింగ్‌ చేశాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో శ్రీరాములు తండ్రి మోర రామచంద్ర బహిర్భూమికి వెళ్లేందుకు ఇంట్లో నుంచి బయటకు రాగా.. పల్సర్‌ బైక్‌ మంటల్లో తగలబడుతూ కనిపించింది. వెంటనే విషయాన్ని శ్రీరాములుకు చెప్పడంతో అతడు వెళ్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. తన బైక్‌కు గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే నిప్పు పెట్టారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని శ్రీరాములు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

గుర్రంపోడు: గాలి వానకు తెగిపడిన సర్వీస్‌ వైరును సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం కాల్వపల్లి గ్రామంలో శనివారం జరిగింది. ఎస్‌ఐ పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్వపల్లి గ్రామానికి చెందిన పంగ యాదయ్య ఇంటి సర్వీస్‌ వైరు గత రాత్రి కురిసిన గాలి వానకు తెగిపడింది. దీంతో గ్రామంలో కరెంట్‌ పనులు చేసే కొండమీది అశోక్‌(40)ను వైరు సరిచేసేందుకు తీసుకెళ్లాడు. అశోక్‌ సర్వీస్‌ వైరును సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. హుటాహుటిన అతడిని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య హేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.

వీడిన హత్య కేసు మిస్టరీ

ములుగు(గజ్వేల్‌): సిద్దిపేట జిల్లా ములుగు మండలం బస్వాపూర్‌ శివారులో జరిగిన గుర్తుతెలియని యువకుడి హత్య మిస్టరీ వీడింది. మృతుడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గోపాల్‌పూర్‌ గ్రామానికి చెందిన దాచారం సాయికుమార్‌(25)గా పోలీసులు గుర్తించారు. మృతుడు పశువులకాపరి అని, అతడు కనిపించకుండా పోయినట్లు తుర్కపల్లి పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం మిస్సింగ్‌ కేసు నమోదైందని గజ్వేల్‌ రూరల్‌ సీఐ మహేందర్‌రెడ్డి, ములుగు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. తుర్కపల్లిలో మిస్సింగ్‌ కేసు నమోదైన నేపథ్యంలో తదుపరి విచారణ తుర్కపల్లి పోలీసులు నిర్వహిస్తారని వివరించారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

మిర్యాలగూడ: కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన భూక్య చిన్నా కుటుంబ కలహాలతో శనివారం గ్రామ శివారులో పురుగుల మందు తాగాడు. కొద్దిసేపటి తర్వాత 108కు ఫోన్‌ చేసి తాను పురుగుల మందు తాగినట్లు సమాచారం ఇచ్చాడు. 108 సిబ్బంది ఎర్రబెల్లి శ్రీనివాస్‌, సైదయ్య గ్రామానికి చేరుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకగా ఓ చెట్టు కింద అపస్మారకస్థితిలో చిన్నాను గుర్తించి.. అతడి సెల్‌ఫోన్‌ తీసుకుని బంధువులకు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వాడపల్లి పోలీసులు పేర్కొన్నారు.

స్వర్ణగిరీశుడికి వసంతోత్సవ సేవ1
1/1

స్వర్ణగిరీశుడికి వసంతోత్సవ సేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement