
అక్రమంగా ధాన్యం తరలిస్తున్న లారీల పట్టివేత
మిర్యాలగూడ అర్బన్: అక్రమంగా ధాన్యం తరలిస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను శనివారం మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రాజశేఖర రాజు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఏపీ కంటే తెలంగాణలో ధాన్యానికి మంచి ధర లభిస్తుండటంతో పాటు క్వింటాల్ సన్న ధాన్యానికి ఇక్కడి ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లిస్తుండడంతో.. కొందరు అక్రమార్కులు ఏపీ రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి రాత్రివేళ నాగార్జునసాగర్, వాడపల్లి చెక్పోస్టులు దాటించి నల్లగొండ జిల్లాలోకి తీసుకొస్తున్నారు.
శుక్రవారం వాడపల్లి చెక్పోస్టు నుంచి జిల్లాలోని అక్రమంగా ప్రవేశిస్తున్న 7 లారీలను పట్టుకోగా.. శనివారం ఉదయం మరో ధాన్యం లారీని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఎనిమిది లారీల్లో సుమారు 2200 ధాన్యం బస్తాలు (165టన్నులు) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీలోని పల్నాడు, గుంటూరు, ప్రకాశం, ఒంగోలు, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి వస్తున్న సుమారు వంద లారీలను వెనక్కు పంపినట్లు డీఎస్పి తెలిపారు. ఏపీ నుంచి తరలివచ్చే ధాన్యాన్ని నల్లగొండ, హుజూర్నగర్, నిజమాబాద్ జిల్లా, ఖానాపూర్కు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. ఈ వ్యవహారంలో 14మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేశామన్నారు. పూర్తి విచారణ అనంతరం నిందుతుల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్, ఎస్ఐలు లక్ష్మయ్య, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏపీ నుంచి తెలంగాణకు తరలించి
బోనస్ కాజేసే యత్నం
వివరాలు వెల్లడించిన మిర్యాలగూడ
డీఎస్పీ రాజశేఖర రాజు