
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
నల్లగొండ: రాష్ట్రంలోని పేదప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మక్తల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా పరిశీలకుడు వాకటి శ్రీహరి అన్నారు. బుధవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలను అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికే రానున్న ఎన్నికల్లో, ఇతర పదవుల్లోనూ అవకాశాలు లభిస్తాయన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు జూకూరి రమేష్, అంకతి సత్యం, మహిళా కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నల్లగొండ జిల్లా పరిశీలకుడు, మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి