
సేంద్రియ పద్ధతిలో విభిన్న పంటల సాగు
ప్రభుత్వం ప్రోత్సహించాలి
సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసేలా రైతులకు ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రోత్సహించాలి. సబ్సిడీపై రుణాలు అందించాలి. సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం, గిట్టుబాటు ధర కల్పించాలి. సేంద్రియ పద్ధతితో పండించిన ఆహార పదార్థాలను తింటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేయడానికి ముందుకొచ్చే రైతులకు అవగాహన కల్పిస్తాను.
– కొప్పుల శైలజారెడ్డి
ఆత్మకూరు(ఎం): ఆమెకు సేంద్రియ వ్యవసాయం చేయడమంటే ఇష్టం. సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలు పండిస్తే భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఆమె ఆలోచన. దీంతో యుట్యూబ్లో చూసి సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం నేర్చుకుంది. తమకున్న వ్యవసాయ భూమిలో భర్త ప్రోత్సాహంతో సేంద్రియ పద్ధతుల్లో వివిధ రకాల పంటలు సాగు చూస్తూ సక్సెస్ అయ్యింది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పుల్లాయిగూడెం గ్రామానికి చెందిన కొప్పుల శైలజారెడ్డి, కృపాకర్రెడ్డి దంపతులకు గ్రామంలో 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కృపాకర్రెడ్డి వ్యాపారం చేస్తుంటాడు. వీరికున్న భూమిలో 4 ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారు. మిగతా 11 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో పండ్ల తోటలు, ఆకుకూరలు, కూరగాయలు సాగును చేయాలని శైలజారెడ్డికి ఆలోచన రాగా భర్త కృపాకర్రెడ్డి సహకరించాడు. దీంతో గతేడాది 11 ఎకరాల్లో మామిడి తోట పెట్టారు. ఈ తోటలో మహాగని, గోల్డెన్ మ్యాంగో, థాయ్లాండ్, మ్యాన్డాక్, ఆపిల్ బేర్ రకాలతో పాటు అంతర పంటలుగా నాలుగు ఎకరాల్లో వేరుశనగ, మూడెకరాల్లో పుచ్చకాయ, దీంతో పాటు మినుములు, పెసర, పోక చెక్క, రుద్రాక్ష, బ్లాక్బేర్, మహాబిల్వం మొక్కలను సాగు చేస్తున్నారు. అంతేకాకుండా బ్రెజిల్ పాలకూర, చిక్కుడు, వంకాయ, కాశీ టమాట, చెర్రి టమాట, చిక్కుడు, సోరకాయతో పలు రకాల ఆకుకూరలు, కూరగాయలు కూడా సాగు చేస్తున్నారు.
ఫాంపాండ్, డ్రిప్ సహాయంతో..
ఈ 11 ఎకరాల్లో భూసారం దెబ్బతినకుండా శైలజారెడ్డి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా వివిధ రకాల ఆకులతో తయారుచేసిన జీవామృతం, వర్మీ కంపోస్టు ఎరువులను తయారు చేస్తోంది. నాలుగు బోర్లు మాత్రమే ఉండటం, అవి కూడా అంతంత మాత్రంగానే పోస్తుండడంతో నీటి కొరతను అధిగమించడానికి ఫాంపాండ్ నిర్మాణం, డ్రిప్ ఏర్పాటు కోసం ఉద్యానశాఖకు దరఖాస్తు చేయగా రూ.75వేల సబ్సిడీతో రూ.5లక్షల రుణం మంజూరు అయ్యింది. దీంతో తోటలో డ్రిప్ ఏర్పాటుతో పాటు ఫాంపాండ్ నిర్మాణం చేశారు. బోరు నుంచి వచ్చిన నీటిని ఫాంపాండ్లో నిల్వ చేస్తున్నారు. ఫాంపాండ్ నుంచి డ్రిప్ సహాయంతో మొక్కలకు నీరు అందిస్తున్నారు. జీవామృతం, వర్మీ కంపోస్టు ఎరువులను కూడా డ్రిప్ ద్వారానే మొక్కలకు అందిస్తున్నారు.
రెయిన్ గన్ల ఏర్పాటు
ఫ సుమారు 11 ఎకరాల్లో
మామిడి తోట పెంపకం
ఫ అందులో అంతర పంటలుగా
వేరుశనగ, పుచ్చకాయ, మినుములు, పెసర, వక్క, రుద్రాక్ష సాగు
ఫ ఆకుకూరలు, కూరగాయలు కూడా..
ఫ సాగు నీటి కొరతను అధిగమించడానికి డ్రిప్, ఫాంపాండ్, రెయిన్ గన్ల ఏర్పాటు
ఫ యూట్యూబ్లో చూసి సాగు చేపట్టిన శైలజారెడ్డి
మామిడి తోటలో అంతర పంటగా సాగు చేస్తున్న వేరుశనగ, పుచ్చకాయ, మినుములు, పెసర, పొక చెక్క పంటలకు నీరు అందించడానికి రెయిన్ గన్లను ఏర్పాటు చేశారు. ఒక్క రెయిన్ గన్ సుమారుగా 30 మీటర్ల దూరం వరకు నీటిని వెదజల్లుతుంది. కోతుల బెడద నుంచి రక్షించుకోవడానికి తోట చుట్టూ సోలార్ విద్యుత్ కంచె ఏర్పాటు చేశారు. తాము 11 ఎకరాల్లో పంటలను పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నామని, ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రోత్సాహం ఉంటే రైతులు సేంద్రియ పద్ధతిలో పంటల సాగుకు ముందుకొస్తారని శైలజారెడ్డి అంటున్నారు.

సేంద్రియ పద్ధతిలో విభిన్న పంటల సాగు

సేంద్రియ పద్ధతిలో విభిన్న పంటల సాగు

సేంద్రియ పద్ధతిలో విభిన్న పంటల సాగు

సేంద్రియ పద్ధతిలో విభిన్న పంటల సాగు