
చెత్తశుద్ధి కరువు
●
దోమలు విజృంభిస్తున్నాయి
భీమవరంలో రోడ్లు, డ్రెయిన్ల వెంబడి చెత్తాచెదారంతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. 1,2 వార్డుల మీదుగా ప్రవహించే మిరియమియా కోడు (మురుగు డ్రెయిన్)లో చెత్తను డంప్ చేస్తున్నారు. దీంతో డ్రెయిన్ మరింత దారుణంగా మారి దోమలు విజృంభిస్తున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదు.
– పాలవెల్లి మంగ, 1వ వార్డు, భీమవరం
నిర్వహణ లేక నిరుపయోగం
మా గ్రామంలో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రం నిర్వహణ లేక నిరుపయోగంగా మారింది. ఈ కేంద్రంలో పొడి, తడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థా లు వేరు చేసే విభాగాలు ధ్వంసమయ్యాయి. దీంతో చెత్తను కేంద్రం ఆవరణలో డంప్ చేస్తున్నారు. కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకువచ్చి వర్మీకంపోస్టు తయారీకి చర్యలు తీసుకోవాలి.
–బి.రాంబాబు కొండేపూడి
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలోని రోడ్డు మార్జిన్లు చెత్తాచెదారాలతో కంపు కొడుతున్నాయి. డ్రెయిన్లు వ్యర్థాలతో అధ్వానంగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఆర్భాటంగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ పరిస్థితి ఇది. తణుకులో పర్యటించిన సీఎం చంద్రబాబు ‘పారిశుద్ధ్య పనులు చేయకపోతే అధికారులు, ప్రజాప్రతినిధులదే బాధ్యత’, ‘ఎక్కడా చెత్త కనిపించవద్దు.. ఎప్పుడైనా వచ్చి తనిఖీ చేస్తా’ అని హెచ్చరించినా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. జిల్లాలోని పట్టణాల నుంచి పల్లెల వరకూ రోడ్ల మార్జిన్లు చెత్తాచెదారం, ప్రమాదకర వస్తువులతో డంపింగ్ యా ర్డులు ఉన్నాయి. అలాగే మురుగు కాలువలు, డ్రెయిన్లు చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి పోయాయి.
20 మండలాలు.. 409 పంచాయతీలు
జిల్లాలో 20 మండలాలు, 6 మున్సిపాలిటీలు, 409 పంచాయతీలు ఉన్నాయి. దాదాపు అన్ని చోట్లా పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగానే ఉంది. కొన్నిచోట్ల డ్రెయిన్లలోకి కొందరు టాయిలెట్స్ పైపులను పెట్టడం, డ్రెయిన్లను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడంతో పూర్తిస్థాయిలో మురుగు పారడం లేదు. దీంతో పర్యావరణ కాలుష్యం పెరుగుతోంది.
సంపద సృష్టి అంతంతమాత్రమే..
జిల్లాలో దాదాపు అన్ని పంచాయతీల్లో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటి నిర్వహణ అధ్వానంగా ఉంది. ఒకటి, రెండు పంచాయతీలు మినహా మిగిలిన కేంద్రాల నిర్వహణను పంచాయతీ అధికారులు గాలికి వదిలివేశారు. దీంతో సంపద సృష్టించే కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. గ్రామాల్లో సేకరించిన చెత్తను కేంద్రాలకు తరలించడం లేదు. కొన్నిచోట్ల కేంద్రాల ఆవరణల్లో, మరికొన్ని చోట్ల ఊరి శివార్లలో రోడ్ల వెంబడి డంప్ చేస్తున్నారు.
సీజనల్ వ్యాధుల వ్యాప్తి
చెత్తను ఎక్కడిపడితే అక్కడ డంప్ చేయడంతో సీజనల్ వ్యాధుల భయం వెంటాడుతోంది. దోమలు విజృంభించి డెంగ్యూ, మలేరియా వ్యాపించే అవకాశం ఉంది. అలాగే పలుచోట్ల జ్వరాలు ప్రబలుతున్నాయి.
అధికారుల అలసత్వం
జిల్లాలో రోడ్లు, డ్రెయిన్లు, మురుగు కాలువలు చెత్తతో నిండిపోతున్నా కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నా పట్టడం లేదు. ఊళ్లన్నీ చెత్తతో నిండిపోతున్నా, చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాల నిర్వహణ తీరు సరిగా లేకున్నా కలెక్టర్ పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ నాయకులపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు తప్ప ఆయా నియోజకవర్గాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదేనా స్వచ్ఛాంధ్ర?
డంపింగ్ యార్డులుగా రోడ్లు, డ్రెయిన్లు
ఆచరణలో కానరాని స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర
నిరుపయోగంగా సంపద సృష్టి కేంద్రాలు
క్షీణించిన పారిశుద్ధ్యంతో సీజనల్ వ్యాధుల భయం
పట్టించుకోని అధికార యంత్రాంగం

చెత్తశుద్ధి కరువు

చెత్తశుద్ధి కరువు

చెత్తశుద్ధి కరువు

చెత్తశుద్ధి కరువు