
హారికను పరామర్శించిన మండలి చైర్మన్
భీమవరం: టీడీపీ, జనసేన మూకల దాడికి గురైన కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు ఆదివారం పరామర్శించారు. శనివారం పెడనలోని హారిక గృహానికి వెళ్లిన దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అడ్వకేట్ సుబ్బారాయుడుకి ప్రశంసలు
పెనుగొండ: పెనుగొండకు చెందిన అడ్వకేట్ అడపా వెంకట సుబ్బారాయుడు, మరో రచయితతో కలసి రచించిన శ్రీరూబ్రిక్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ పుస్తకానికి ప్రశంసలు దక్కాయి. నల్సార్ వర్శిటీ స్నాతకోత్సవంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్, తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ పాల్, సుప్రీంకోర్టు జస్టిస్ పీఎస్ నరసింహ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పుస్తకాన్ని అవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత అడపా వెంకట సుబ్బారాయుడును పలువురు ప్రశంసించారు. సుబ్బారాయుడు పెనుగొండకు చెందిన హైకోర్డు న్యాయవాది ఇండుగపల్లి రామానుజరావు కుమారుడు.
నరసాపురం లేసుకు మరో గుర్తింపు
భీమవరం (ప్రకాశంచౌక్): నరసాపురం లేసుకు మరో అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ శ్రీఒక జిల్లా– ఒక ఉత్పత్తిశ్రీ కింద 2024–25 ఏడాదికి ఎంపికై ంది. రాష్ట్రం నుంచి 26 జిల్లాల ఉత్పత్తులు పోటీ పడగా.. క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం 7 జిల్లాలకు చెందిన ఉత్పత్తులు ఎంపికయ్యాయి. వాటిలో లేసు అల్లికలు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణం. ఈ పురస్కారాన్ని అందుకొనేందుకు కలెక్టర్ చదలవాడ నాగరాణి ఢిల్లీ వెళ్లారు. ప్రగతి మైదానం సోమవారం జరిగే కార్యక్రమంలో అవార్డును కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి చేతుల మీదుగా అందుకుంటారు. లేసు అల్లికలకు గత కొద్ది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. ఈ అవార్డును కలెక్టర్ నాగరాణి ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందుకున్నారు.
నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను ఈ సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఆలస్యంగా విద్యార్థినులకు భోజనంపై ఆగ్రహం
నూజివీడు: పట్టణంలోని బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ల బాధ్యత రాహిత్యం కారణంగా విద్యార్థినులు ఆదివారం ఆకలితో అలమటించారు. మధ్యాహ్నం 12.30 గంటల కల్లా భోజనం పెట్టాల్సి ఉండగా రెండు గంటల వరకు పెట్టలేదు. ప్రిన్సిపాల్ బాధ్యతలను వైస్ ప్రిన్సిపాల్ కు అప్పగించి వెళ్లగా, వైస్ ప్రిన్సిపాల్ మరొక టీచర్ కు బాధ్యతలను అప్పగించారు. 600 మంది విద్యార్థినులు ఉండగా ఆదివారం కావడంతో పిల్లలను కలుసుకునేందుకు వచ్చిన తల్లిదండ్రులను లోపలికి అనుమతించలేదు. రెండు గంటలవుతున్నా భోజనం పెట్టకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తల్లిదండ్రులు గొడవ చేయడంతో చివరికి రెండు గంటల తరువాత భోజనం పెట్టారు. కొందరు తల్లిదండ్రులు తహసీల్దార్కు సమాచారం అందించడంతో ఆయన వీఆర్వోలను గురుకుల పాఠశాల వద్దకు పంపించారు. సెలవు రోజులు వస్తే ఇలాంటి ఇబ్బందులు తరచూ ఎదురవుతున్నాయని విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

హారికను పరామర్శించిన మండలి చైర్మన్