
9 కిలోల గంజాయి పట్టివేత
నలుగురు గంజాయి విక్రేతల అరెస్ట్
ఏలూరు టౌన్: గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి నిందితుల నుంచి 9 కిలోల గంజాయి, రెండు మోటారు సైకిళ్లు, రూ.4,100 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి సీఐ వి.కోటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామ పరిధిలోని ఏలూరు జాతీయ రహదారి–16 సర్వీస్ రోడ్డులో గంజాయి విక్రయిస్తున్నారని తెలియటంతో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో త్రీటౌన్ ఎస్సై రాంబాబు, సిబ్బంది చాకచక్యంగా దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్–1985 మేరకు కేసు నమోదు చేశామన్నారు. విలాసాలు, సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో నిందితులు గంజాయి విక్రయిస్తున్నారని ఆయన తెలిపారు. నిందితులు బాపట్ల జిల్లా అద్దంకి మండలం ప్రాంతానికి చెందిన సైడ వేణు, ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పాదర్తికి చెందిన సింబత్తుల సాయి, అదే గ్రామానికి చెందిన అలుగుల నాగవర్థన్గా గుర్తించామని, వీరితోపాటు ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు సీఐ చెప్పారు.