
ఇంకా వెలగని ‘దీపం’
దెందులూరు: ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన దీపం పథకం ఫలితం నీరుగారుతోంది. సుమారు రెండు నెలలైనా దీపం–2 రెండో విడత నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. తొలి విడతలో ఈ పథకం ద్వారా అరకొరగా నగదు విడుదల చేశారు. రెండో విడత పూర్తిగా విస్మరించారు. 2024 నవంబర్లో దీపం–2 పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం 2025 మార్చి 31 వరకు స్కీంను అమలు చేసింది. మొదటి విడత కొంతవరకు నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. రెండో విడత 2025 ఏప్రిల్ నుంచి ప్రారంభమైంది. రెండు నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఖాతాల్లో పైసా కూడా జమ కాలేదు.
జిల్లాలో అన్ని గ్యాస్ కంపెనీలకు సంబంధించి 55 ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో సింగిల్, డబుల్ సిలిండర్ల కనెక్షన్లు కలిపి 6,92,825 ఉన్నాయి. మొదటి విడత జిల్లా వ్యాప్తంగా 4,40,278 మంది లబ్ధిదారులు గ్యాస్ బుక్ చేసుకున్నారు. 4,35,035 కనెక్షన్లకు మాత్రమే నగదు బ్యాంకు ఖాతాల్లో జమైంది. రూ.49,78,950 బకాయిలు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నెలాఖరుకు వరకు రెండో విడత గడువు నిర్ణయించారు. దీనికి సంబంధించిన నిధులు ఇంతవరకూ అందలేదు. రెండో విడతకు సంబంధించి రెండు నెలలుగా ఏప్రిల్, మే నెలల్లో జిల్లాలో సుమారుగా 1,77,040 మంది గ్యాస్ బుక్ చేసుకున్నారు. వారు ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు చెల్లించారు.
ఫిర్యాదులు బుట్టదాఖలు
దీపం పథకం సిలిండర్ నగదు అందలేదని చాలా మంది లబ్ధిదారులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేస్తున్నారు. అయితే వారి నగదుకి సంబంధించిన సమాచారం లేకపోవడం, గ్యాస్ కంపెనీలు తమ వద్ద ప్రభుత్వ నగదు లేదని స్పష్టం చేయడంతో ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారు.
రెండు నెలలైనా అందని గ్యాస్ సబ్సిడీ
రెండో విడత సుమారు రూ.19.81 కోట్ల బకాయిలు