
జయహో జగన్నాథా
ద్వారకాతిరుమల: పూరి క్షేత్రంలో వలే జగన్నాథ రధోత్సవాలను శ్రీవారి క్షేత్ర దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని జగన్నాథుని ఆలయంలో ఈనెల 27 నుంచి వచ్చేనెల 6 వరకు వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా జగన్నాథ స్వామివారు ఆలయ యాగశాలలో రోజుకో అలంకారంలో భక్తులకు దర్వనమివ్వనున్నారు. దీన్ని పురస్కరించుకుని యాగశాల ప్రాంతాన్ని ముస్తాబు చేస్తున్నారు. అలాగే స్వామివారి రథయాత్రలకు వినియోగించే రథ వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆలయం ముందు చలువ పందిరిని నిర్మించారు. అదేవిధంగా ఆలయాన్ని, పరిసరాలను విద్యుద్దీప తోరణాలతో అలంకరించారు. ఉత్సవాల ప్రారంభం రోజు శుక్రవారం సాయంత్రం సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు రథ వాహనంలో కొలువుదీరి ద్వారకాతిరుమల క్షేత్రానికి వెళ్లనున్నారు. అలాగే వచ్చేనెల 6 న ఆలయం నుంచి సమీప గ్రామమైన తిమ్మాపురం వైపు రథయాత్ర సాగనుంది. ఉత్సవాలు జరిగే పదిరోజులు జగన్నాథుని దశావతారాలు భక్తులను అలరించనున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తరించాలని ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి కోరారు. ఉత్సవాల్లో భాగంగా రోజుకో ప్రత్యేక అలంకారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు.
ఆలయ విశిష్టత
ఈ ఆలయాన్ని ఒరిస్సా రాష్ట్రానికి చెందిన పూరీ వాస్తవ్యులు, మఠాధిపతులైన మంత్రరత్నం అమ్మాజీ అనే లక్ష్మీ అమ్మవారు 130 ఏళ్ల క్రితం నిర్మించారు. అందులో జగన్నాథునితో పాటు, వేంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి కల్యాణోత్సవ, పవిత్రోత్సవాలతో కై ంకర్యాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీవారి దేవస్థానం ఈ ఆలయాన్ని దత్తత తీసుకున్న తరువాత జీర్ణోద్ధరణ గావించి మరింత అభివృద్ధి చేసింది. ఈ ఆలయంలో వేంకటేశ్వర స్వామి, అమ్మవార్లతో పాటు జగన్నాథ స్వామి, బలరామస్వామి, సుభద్రాదేవుల సన్నిధి, ఆళ్వారుల సన్నిధి, శ్రీ సంతాన వేణుగోపాల స్వామి సన్నిధి ఉన్నాయి.
రేపటి నుంచి లక్ష్మీపురం ఆలయంలో
జగన్నాథ రథోత్సవాలు

జయహో జగన్నాథా

జయహో జగన్నాథా