
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
భీమడోలు: సూరప్పగూడెంలోని పాత సుగర్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సూరాబత్తుల సాయిబాబు(30) పాత షుగర్స్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్నాడు. ఈనెల 24న ఫ్యాక్టరీలో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల షిఫ్ట్లో పని చేసేందుకు వెళ్లాడు. రాత్రి 10 గంటలకు షిఫ్ట్ దిగాల్సి ఉండగా రిలీవర్కు ఆతను కనిపించలేదు. ఫ్యాక్టరీలో ఉన్న చెరువు పక్కన అతని దుస్తులు కనిపించడంతో చెర్వులో వెతకగా బుధవారం అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి చిరంజీవి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. కాగా సాయిబాబుతో మనస్పర్థల కారణంగా అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన సాయిబాబు ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.