
బీజీబీఎస్ మహిళా కళాశాల వ్యవహారంపై విచారణ
నరసాపురం: పట్టణంలో పద్మశ్రీ అద్దేపల్లి సర్విశెట్టి స్థాపించిన బీజీబీఎస్ మహిళా కళాశాల పాలకవర్గంపై ఇటీవల వస్తున్న ఆరోపణలపై బుధవారం ఉన్నత విద్యామండలి ఆర్జేడీ (రాజమండ్రి) పీవీ కృష్ణారావుతో కూడిన అధికార బృందం కళాశాలలో విచారణ నిర్వహించింది. కళాశాల అధ్యక్షుడు, కార్యదర్శి, ట్రెజరర్ కలిపి కళాశాల ఆస్తులు ఇస్టానుసారం అమ్మేస్తున్నారని, కళాశాలలో అవకతవకలు జరుగుతున్నాయనే అంశాన్ని ఇటీవల ‘అమ్మకానికి మహాశయుడి ఆస్తులు’ శీర్షికన సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకురావడంతో డొంక కదిలింది. కళాశాలలో పనిచేస్తున్న మహిళా అధ్యాపకురాలు ఒకరు బయటకు వచ్చి కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నూలి శ్రీనివాస్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మీడియాకు వివరించడం చర్చనీయాంశమైంది. కళాశాల వ్యవహరాలపై చర్యలు తీసుకోవాలని కావలి నాని అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు.
లోపల విచారణ.. బయట ఆందోళన
కళాశాలలో అధికారులు విచారణ జరుపుతుండగా, బయట కాంట్రాక్ట్ అధ్యాపకులు, సిబ్బందితో కలసి బీసీ సంఘ నేత చింతపల్లి గురుప్రసాద్ నాయకత్వంలో ఆందోళన నిర్వహించారు. కరస్పాండెంట్ నూలి శ్రీనివాస్ కబంధహస్తాల నుంచి కళాశాలను కాపాడాలని, పాలకవర్గంపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టౌన్ ఎస్సై ముత్యాలరావు సిబ్బందితో వచ్చి బందోబస్తు నిర్వహించారు. విచారణ అధికారి కృష్ణారావు విద్యార్థులు, అధ్యాపకులను విచారించి వివరాలు రికార్డు చేసుకున్నారు. ఈ వ్యవహారానికి కేంద్ర బింధువైన నూలి శ్రీనివాస్ విచారణకు హాజరుకాకపోవడం విశేషం. అనంతరం కృష్ణారావు విలేకరులతో మాట్లాడుతూ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. ఆందోళనలో బిళ్లు బ్రదర్స్, కోట్ల రామకృష్ణారావు, కోట్ల రాజా, స్వర్ణాంధ్ర త్రినాథ్ పాల్గొన్నారు.