
ఈవీఎం గోడౌన్ తనిఖీ
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం పీపీ రోడ్డులోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం తనిఖీ చేశారు. గోడౌన్న్కు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపడం జరుగుతుందని తెలిపారు.
మా పాఠశాలను విలీనం చేయొద్దు సార్
భీమవరం అర్బన్: మా పాఠశాలను విలీనం చేయొద్దని దెయ్యాలతిప్పలోని ఎస్సీ పేటకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలక్టరేట్లోని డీఆర్వో మొగలి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను విలీనం చేసే ప్రక్రియలో భాగంగా ఎస్సీ పేటలో ఉన్న పాఠశాలను బీసీ పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారులకు మొర పెట్టుకున్నారు. గతంలో బీసీ పేటలోని వ్యక్తులకు తమ పేటలోని వ్యక్తులకు గొడవలు అయ్యాయని, ఇప్పుడు విలీనం చేయడం వల్ల మళ్లీ గొడవలు జరిగే ప్రమాదం ఉందని వినతిపత్రంలో ఎస్సీ పేట వాసులు తెలిపారు. సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని డీఆర్వో హామీ ఇచ్చారు.
గ్యాస్ నొప్పితో మహిళ మృతి
చాట్రాయి: గ్యాస్ నొప్పితో ఓ మహిళ మృతి చెందింది. వివరాల ప్రకారం మండలంలోని పోతనపల్లి గ్రామానికి చెందిన వడిత్యా కామాక్షి (35) బధవారం గ్యాస్ నొప్పిగా ఉందని భర్తతో కలిసి చాట్రాయి ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయించారు. టిఫిన్ చేసి రావాలని ఆర్ఎంపీ వైద్యుడు సూచించారు. అనంతరం టిఫిన్ చేసి వచ్చిన తరువాత బీపీ చూస్తుండగా ఆమె అకస్మాతుగా వాంతులు చేసుకుని అక్కడే సృహ తప్పి పడిపోయింది. వెంటనే పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు పీహెచ్సీ వైద్యురాలు విజయలక్ష్మి చెప్పారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆమె మృతితో భర్త, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. విజయలక్ష్మి భౌతికకాయాన్ని ఏపీ కో ఆపరేటివ్ యూనియన్ రాష్ట్ర మాజీ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి, వైఎస్సార్ సీపీ నేత కారంగుల వాసు తదితరులు సందర్శించి నివాళులర్పించారు.

ఈవీఎం గోడౌన్ తనిఖీ