
‘ఎస్’ వెనుక ఎవరు?
సాక్షి టాస్క్ఫోర్స్: నూజివీడు నియోజకవర్గంలోని మద్యం బెల్టుషాపులకు మద్యం సిండికేట్ సరఫరా చేస్తున్న మద్యం సీసాలపై ‘ఎస్’ స్టిక్కర్ ఉండటంతో నియోజకవర్గ వ్యాప్తంగా సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఊరూరా పదుల సంఖ్యలో బెల్టుషాపులు, మద్యం దుకాణాల వద్ద బార్లను తలపించేలా అనధికార సిట్టింగ్లతో మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. ఇష్టారాజ్యంగా సిట్టింగ్లతో మద్యం వ్యాపారం జోరుగా సాగుతున్నప్పటికీ అనధికార సిట్టింగ్ల వైపు ఎకై ్సజ్ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం సిండికేట్ బెల్టుషాపులకు ‘ఎస్’ స్టిక్కర్తో మద్యం సీసాలను సరఫరా చేస్తుండటం తీవ్ర సంచలనంగా మారింది. ఈ స్టిక్కర్ అర్థం ఏమిటి, దీని వెనుక ఉన్నదెవరనే ప్రశ్నలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మద్యం షాపుల నుంచి బెల్టుషాపులకు మద్యం సీసాలు రవాణా అవుతుంటే స్టిక్కర్ వేయాల్సిన అవసరమేముందనే సందేహం ప్రతి ఒక్కరిలో వస్తోంది. అలా కాకుండా ఇంకేదైనా మద్యంను సరఫరా చేస్తున్నారా అనే అనుమానాలు ప్రబలడానికి ఆస్కారం ఏర్పడింది.
బెల్టుషాపుల్లో ఎమ్మార్పీ కంటే
రూ.40 అధికం
ఏ గ్రామంలోనైనా బెల్టుషాపు పెట్టాలంటే రూ.25 వేలు చెల్లించాల్సిందే. బెల్టుషాపులకు అనుమతి లేదని, ఎమ్మార్పీ ధరలకే మద్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం ప్రకటనలు ఇస్తుంటే ఇక్కడ మాత్రం ఒక్కో సీసాపై రూ.20 నుంచి రూ.40 అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మద్యం సిండికేట్ బెల్టుషాపులకు ఏ మద్యం బ్రాండ్ అయినా సరే ఒక్కో సీసాపై ఎమ్మార్పీపై అదనంగా రూ.20కు విక్రయిస్తుండగా బెల్టుషాపుల నిర్వాహకులు మరో రూ.20 వేసుకొని మందుబాబులకు అమ్ముతున్నారు. దీంతో ఒక్కో సీసాకు ఎమ్మార్పీ కంటే రూ.40 అదనంగా చెల్లించి మందుబాబులు మద్యంను సేవించాల్సి వస్తోంది. పెద్ద ఎత్తున అధిక ధరలకు విక్రయిస్తూ ఇంత దారుణంగా దోపిడీ చేస్తుంటే పట్టించుకోవాల్సిన ఎకై ్సజ్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు దాడులు చేస్తూ బెల్టుషాపుల నిర్వహణకు అనుమతి లేదంటూ ప్రకటనలు ఇచ్చి మిన్నకుండిపోతున్నారు.
మద్యం సీసాలపై ‘ఎస్’ స్టిక్కర్పై సర్వత్రా చర్చ