
పెదవేగి కర్మాగారం ప్రైవేటీకరిస్తే ఊరుకోం
పెదవేగి: ఆయిల్పామ్ రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీఐటీయు జిల్లా నాయకులు హెచ్చరించారు. సోమవారం సాయంత్రం పెదవేగిలోని ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని పరిశీలించి కార్మికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్.లింగరాజు, డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడుతూ పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరించి రైతులు, కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రభుత్వం ఆలోచన చేయడం తగదన్నారు. ఫ్యాక్టరీ జోన్ పరిధిని, ఫ్యాక్టరీని ప్రైవేటు వారికి అప్పగించాలనే ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని కోరారు. దేశంలోనే అత్యధిక ఆయిల్పామ్ విస్తీర్ణం ఏలూరు జిల్లాలోనే ఉందన్నారు. ఆయిల్ పామ్ గెలల ధర ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో వచ్చే ఆయిల్ రికవరీ శాతం( ఓ ఇ ఆర్ ) ప్రామాణికంగా ఉందని చెప్పారు. ఈ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణతో భవిష్యత్తులో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ చర్యలు ఆపి కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయిల్పామ్ రైతులు సంఘటితంగా పోరాడి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.