
23న వైఎస్సార్సీపీ యువత పోరు
భీమవరం: కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను మోసం చేశారని, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈనెల 23న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్టు పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్ తెలిపారు. శుక్రవారం భీమవరంలో యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రతి నెలా నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటూ గొప్పగా ప్రచారం చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా యువతకు ఇచ్చిన ఒక్క వాగ్దానం అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం కళ్లు తెరిపించి యువతకు ఇచ్చిన హామీల అమలుకు తాము నిరసన బాటపట్టనున్నట్లు చెప్పారు. సోమవారం ఉదయం 10 గంటలకు భీమవరం పట్టణ శివారు విస్సాకోడేరు వంతెన వద్ద నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్కు వెళ్లి వినతిపత్రం అందిస్తామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సందీప్ కోరారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం జనరల్ సెక్రటరీ పాము యోహాన, మండల ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి రాజు, సన్నీ, చందు, జానీ, రాహుల్, ప్రవీణ్, చింటూ తదితరులు పాల్గొన్నారు.