
రెవెన్యూ చట్టాలపై అవగాహన అవసరం
భీమవరం (ప్రకాశంచౌక్): రెవెన్యూ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి, ప్రజలకు మంచి సర్వీసులను అందించడానికి రెవెన్యూ ఉద్యోగులు కృషి చేయా లని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శుక్రవారం రెవెన్యూ దినోత్సవాన్ని కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నందుకు గర్వపడాలని, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు రూల్స్ను అనుసరిస్తూ పనిచేయాలని, పనితోనే గుర్తింపు లభిస్తుందన్నారు. రెవెన్యూ శాఖలో పని చేసి రిటైర్ అయిన తహసీల్దార్లు లక్కు నరసింహారావు, పాంచజన్యమూర్తి, డిప్యూటీ తహసీల్దార్ బాబాజీ, వీఆర్వో బి.వెంకట సుబ్బారావు, ఆఫీస్ సబార్డినేట్ మణికంఠలను సత్కరించి జ్ఞాపికలు అందించారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, భీమవరం ఆర్డీఓ కె.ప్రవీణ్కుమార్రెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ ఎస్.శివశంకర్ పాల్గొన్నారు.