
గుండెపోటుతో కూలీ మృతి
ఆకివీడు: గుండెపోటుతో ఓ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన ఆకివీడు రైల్వేస్టేషన్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద బియ్యం బస్తాల వ్యాగన్లలో కూలీలు బియ్యం లోడు చేస్తున్నారు. వారికి మంచినీళ్లు అందిస్తున్న కూలీ దుంపగడకు చెందిన నిమ్మల రాంబాబు (54) అకస్మాత్తుగా సొమ్ముసిల్లి పడిపోయాడు. తోటి కార్మికులు గమనించి అతడిని ఆసుపత్రికి తరలించేలోపు గుండెపోటుతో మృతి చెందాడు. రాంబాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన రాంబాబు కుటుంబానికి ఎఫ్సీఐ గోడౌన్ యజమాన్యం ఆర్థిక సహాయం అందజేసే విధంగా సర్పంచ్ ముద్దే విశ్వేశ్వరరావు, మాజీ ఉపసర్పంచ్ కొట్టు ఆంజనేయులు తదితరులు బాధిత కుటుంబానికి బాసటగా నిలిచారు.
21 నుంచి పాలిసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
తణుకు అర్బన్: డైరెక్టర్ అండ్ కన్వీనర్ పాలిసెట్ 2025 ఆదేశాల మేరకు పాలిసెట్కు అర్హత పొందిన విద్యార్థులకు తణుకు శ్రీ ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటుచేసినట్లు ప్రిన్సిపాల్ ఎన్.తులసిరాధ తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు కళాశాల ప్రాంగణంలో ధ్రువపత్రాల పరిశీలన, 25 నుంచి 30వ తేదీ వరకు ఐచ్ఛికాల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని జూలై 3వ తేదీన సీట్ల కేటాయింపు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోని ఎస్టీ విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన తణుకు హెల్ప్లైన్ సెంటర్లో మాత్రమే నిర్వహించబడుతుందని వివరించారు. కౌన్సెలింగ్ షెడ్యూలు ప్రకారం 21న 1 నుంచి 15వేలు ర్యాంకు, 22న 15,001 నుంచి 32వేలు, 23న 32,001 నుంచి 50 వేలు, 24న 50,001 నుంచి 68 వేలు, 25న 68,001 నుంచి 86 వేలు, 26న 86,001 నుంచి 1,04,000, 27న 1,04,001 నుంచి 1,20,000, 28న 1,20,001 నుంచి చివరి ర్యాంకు వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. వెబ్ ఆప్సన్స్ కోసం 25, 26 తేదీల్లో 1 నుంచి 50 వేలు, 27, 28 తేదీల్లో 50,001 నుంచి 90వేలు, 29, 30 తేదీల్లో 90,001 నుంచి చివరి ర్యాంకు వరకు నిర్వహిస్తామని చెప్పారు. వివరాలకు 99123 42012, 94900 32025 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
రివర్స్ చేస్తుండగా లారీ కింద పడి..
ఉంగుటూరు: రివర్స్ చేస్తుండగా లారీ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల ప్రకారం చేబ్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో తల్లాపురం రోడ్డును ఆనుకుని కొత్తగా వెంచర్ వేస్తున్నారు. ఆ వెంచర్లో మెరక పనులు చేస్తున్న నేపథ్యంలో లారీ రివర్స్ చేస్తుండగా లారీ కింద పడి అక్కడ పనిచేస్తున్న గాది గంటయ్య (55) అక్కడికక్కడే మృతి చెందాడు. గంటయ్యకు భార్య, వివాహం అయిన ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి ఉన్నారు. చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.