
‘గురుకుల’ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్
భీమడోలు: పోలసానిపల్లి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల కళాశాలలో గురుకుల సొసైటీ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ శుక్ర వారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే కౌన్సెలింగ్కు జోన్–2 పరిధిలోని ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల్లోని గురుకుల బాలురు, బాలికల క ళాశాలలకు చెందిన 438 మంది ప్రిన్సిపాల్స్, జూనియర్ అధ్యాపకులు, పీజీటీలు హాజరుకానున్నారు. గురుకుల సొసైటీ సంయుక్త కార్యదర్శి ఎ.మురళీ సమక్షంలో కౌన్సెలింగ్ చేప ట్టారు. తొలిరోజు 73 మందికి బదిలీ ఉత్తర్వులు అందించారు. టీజీటీ, స్పెషల్ టీచర్లు, సూపరిండెంటెంట్, సీనియర్ అసిస్టెంట్ల కేడర్లలోని ఉద్యోగులకు మంగళవారం కౌన్సెలింగ్ జరుగనుంది. డీసీఓ బీపీ ఉమాకుమారి, ఆయా జిల్లాల డీసీఓలు పాల్గొన్నారు.
ప్రైవేట్ బస్సులపై 152 కేసుల నమోదు
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని కలపర్రు టోల్గేట్ వద్ద గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కాంట్రాక్టు క్యారేజ్ బస్సులపై 152 కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ తెలిపారు. అలాగే రూ.5,01,500 అపరాధ రుసుం, పన్ను విధించినట్లు తెలిపారు. జిల్లాలోని వాహన తనిఖీ అధికారులను బృందాలుగా ఏర్పాటు చేసి కేసు లు నమోదు చేశామన్నారు. విశాఖ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖ మధ్య తిరిగే కాంట్రాక్టు క్యారేజ్ బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పర్మిట్ నిబంధనలను ఉ ల్లంఘించిన బస్సులపై కేసులు నమోదు చే శామన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్టీఓలు కేఎస్ఎంఎన్ కృష్ణారావు, ఎండీ మదానీ, వాహన తనిఖీ అధికారులు ఎస్.రంగనాయకులు, జి.ప్రసాదరావు, జి.స్వామి, వై.సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ కగార్పై మండిపాటు
ఏలూరు (టూటౌన్): ఆపరేషన్ కగార్ ఆపా లని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాల అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ నక్సలైట్ల రహిత భారతదేశాన్ని 2026 నాటికి చూపిస్తామని చెబుతూ అడవి మీద ఆధారపడి జీవిస్తున్న గిరిజనులను అడవి నుంచి దూరంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ పేరిట అటవీ ప్రాంతంలోని విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని మోదీ, అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెసు జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్రావు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు.
పట్టణ ప్రజలపై ఆస్తి పన్ను భారం
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం పెంచిన ఆస్తి పన్ను ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నును 20 శాతం పెంచాలని నిర్ణయించి ఆ మేరకు కొలతలు వేసే సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఆస్తి పన్ను పెంచబోమని హామీ ఇచ్చిన ఇప్పుడు తుంగలో తొక్కుతున్నారన్నారు.

‘గురుకుల’ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్

‘గురుకుల’ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్