
పేరుపాలెం బీచ్లో యువకుడి గల్లంతు
నరసాపురం రూరల్: స్నేహితులతో కలసి విహారయాత్రకు వచ్చిన ఒక యువకుడు పేరుపాలెం బీచ్లో గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. దేవరపల్లి మండలం చిన్నాయగూడెంకు చెందిన యాదాల అజయ్ (27) మరో ఆరుగురు స్నేహితులతో కలిసి పేరుపాలెం బీచ్కు వచ్చారు. తీరంలో సరదాగా ఆడుకుంటూ ఉండగా భారీ అలలు రావడంతో అజయ్ గల్లంతైనట్లు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు. అజయ్ మేనమామ పాలపాటి శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వాసు తెలిపారు.
సైబర్ నేరం.. వ్యాపారికి రూ.85 వేలకు టోకరా
నరసాపురం రూరల్: సైబర్ నేరగాళ్లు ఓ వ్యాపారికి రూ.85 వేలకు టోకరా వేసిన ఘటన ఆదివారం మొగల్తూరులో చోటుచేసుకుంది. వివరాలు ఇవి. మామిడిపండ్ల వర్తకుడు దూసనపూడి రాజుకు ఆదివారం మధ్యాహ్నం ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాను మొగల్తూరు ఏఎస్ఐ ఆనందరావునని, తన మేనకోడలుకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఆసుపత్రికి డబ్బు అర్జంటుగా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పాడు. తన దగ్గర డబ్బులు ఉన్నాయని, కానీ బ్యాంకు ఖాతాలో లేకపోవడంతో ఫోన్ చేసినట్లు వివరించాడు. అయితే తన ఖాతాలో కూడా నగదు లేదని దూసనపూడి రాజు చెప్పడంతో ఇంకా ఎవరికై నా పురమాయించమని ఆ వ్యక్తి కోరాడు. విషయం నిజమనుకున్న రాజు మొగల్తూరు కూరగాయల మార్కెట్ వ్యాపారి ముక్కు పురుషోత్తంకు పురమాయించాడు. పురుషోత్తం స్టేషన్ వద్దకు వెళ్లి బయట నుంచే ఆ వ్యక్తికి ఫోన్ చేయగా నేను సినిమా హాల్ సెంటర్లో ఉన్నాను.. ఈ 7993014578 నంబర్కు రూ.85 వేలు ఫోన్ పే చేయాలని సూచించాడు. పురుషోత్తం వెంటనే రూ.85 వేలను ఆ నంబర్కు ఫోన్ పే చేశాడు. తర్వాత ఎంత సేపటికీ ఆ వ్యక్తి స్టేషన్కు రాకపోవడంతో మోసపోయినట్టు గ్రహించిన పురుషోత్తం పోలీసులకు, సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశాడు.