
ప్రయాణికురాలికి బ్యాగ్ అప్పగింత
తణుకు అర్బన్: తణుకు రైల్వే స్టేషన్లో పోగొట్టుకున్న బ్యాగ్ను వృద్ధురాలికి రైల్వే పోలీసులు అప్పగించిన ఘటన ఇది. తమిళనాడుకు చెందిన అంబిక గురువారం సాయంత్రం సర్కారు ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు తణుకు రైల్వే స్టేషన్కు వచ్చారు. అదే సమయంలో తన బ్యాగ్ కనిపించకపోవడంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే ఎస్సై సుబ్రహ్మణ్యం ఆదేశాలతో రైల్వే కానిస్టేబుల్ ముద్దే బాల వెంటనే బ్యాగ్తోపాటు నగదును కూడా గుర్తించి బాధితురాలికి అప్పగించారు. సకాలంలో స్పందించిన రైల్వే పోలీసులపై బాధితురాలితోపాటు ప్రయాణికులు ప్రశంసల జల్లు కురింపించారు.
మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య
భీమడోలు: మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం పోలసానిపల్లి గ్రామానికి చెందిన కోటా రాము (45) మద్యానికి బానిసై పనికి వెళ్లడం లేదు. దీంతో భార్య అతడిని మందలించగా వారిద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన రాము గురువారం తన ఇంటలోని రేకుల షెడ్డు దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రామును కిందకు దింపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టమ్ నిమిత్తం తరలించారు. భీమడోలు పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. మృతుడు రాముకి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
తమ సర్టిఫికెట్లు ఇప్పించాలని పూర్వ విద్యార్థుల ధర్నా
జంగారెడ్డిగూడెం: తమ సర్టిఫికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం వేగవరం నోవా కళాశాల ప్రాంగణంలో పూర్వ విద్యార్థులు ధర్నా కు దిగారు. వారు తెలిపిన వివరాలివి. వేగవరం నోవా కళాశాలలో 2015 నుంచి 2020 మధ్యకాలంలో చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలకు చెందిన సుమారు 30 మంది విద్యార్థులు టీటీసీ, బీఈడీ, బీపీడీ, డిగ్రీ తదితర కోర్సులు అభ్యసించారు. అడ్మిషన్ సమయంలో విద్యార్థుల నుంచి ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ ఒరిజినల్స్ తీసుకున్నారు. కోర్సులు పూర్తయిన తరువాత సదరు సర్టిఫికెట్లను విద్యార్థులకు తిరిగి ఇవ్వలేదు. అప్పటి నుంచి సర్టిఫికెట్ల కోసం కాలేజ్ చుట్టూ తిరుగుతూనే ఉన్నామని పూర్వ విద్యార్థులు విజయలక్ష్మి, సత్యనారాయణ, దుర్గారావు, అవినాశ్, సాగర్, సుధీర్, సాయి, అనూష తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో తమ సర్టిఫికెట్లు తమకు ఇవ్వాలని గురువారం విద్యార్థులు విద్యాసంస్థల కార్యాలయం ఎదుట బైటాయించి ధర్నాకు దిగారు. ధర్నా అనంతరం జంగారెడ్డిగూడెం ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు.

ప్రయాణికురాలికి బ్యాగ్ అప్పగింత