వైద్యానికి సుస్తీ | - | Sakshi
Sakshi News home page

వైద్యానికి సుస్తీ

Jun 1 2025 12:50 AM | Updated on Jun 1 2025 12:50 AM

వైద్య

వైద్యానికి సుస్తీ

గత ప్రభుత్వంలో పేదల ఆరోగ్యానికి భరోసా

గత జగన్‌ ప్రభుత్వంలో పేదల ఆరోగ్యానికి భరోసా గా ఉండేది. ఆరోగ్యశ్రీలో సేవలు పారదర్శకంగా, ఉచితంగా అన్నిరకాల వ్యాధులకు చికిత్స లభించేది. గ్రామాల్లోకి అన్నిరకాల వైద్యులు వచ్చి వైద్యసేవలు అందించేవారు. 104 వాహనం ద్వారా డాక్టర్లు వచ్చి ఇంటింటికీ వెళ్లి మంచంపై ఉన్నవారికి, అంగన్‌వాడీ, స్కూల్‌ పిల్లలకు కూడా వైద్య పరీక్షలు, వైద్య సేవలు అందించేవారు. కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు, ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిలిపివేస్తున్నారు.

– కాండ్రేగుల శ్రీను, నరసన్న చెర్వుపాలెం, వీరవాసరం మండలం

మహిళలకు వరంగా ‘సురక్ష’ శిబిరాలు

గత ప్రభుత్వంలో వార్డులు, గ్రామాల వారీగా నిర్వహించిన ఆరోగ్య సురక్ష క్యాంపులు మహిళలకు, పేదలకు వరంగా ఉండేవి. ముఖ్యంగా క్యాంపులకు గైనకాలజిస్టులు, ఇతర సెష్పలిస్టుగా ఉన్న మహిళా వైద్యు లు రావడంతో మహిళల్లో ఆరోగ్య సమస్యలను ఆదిలోనే గుర్తించి సకాలంలో మెరుగైన వైద్యం అందించడం, శస్త్రచికిత్స కోసం ఆరోగ్యశ్రీకి సిఫార్సు చేయడం జరిగేది. ఈ క్యాంపుల్లో మహిళల్లోని గర్భాశయ, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసులను గుర్తించి సకాలంలో వైద్యం అందించి ప్రాణాలను రక్షించేవారు. కూటమి ప్రభుత్వంలో సీజనల్‌ వ్యాధులకు మెడికల్‌ క్యాంపులు కూడా ఏర్పాటుచేయడం లేదు.

– పాలవెల్లి మంగ, భీమవరం

ఒంట్లో నలత చేసినా ఆందోళన అక్కర్లేదు.. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ ఫిజీషియన్‌ రూపంలో వైద్యులు ఊరికే వచ్చి సేవలు అందిస్తారన్న ధీమా.. ఎంత పెద్ద రోగమొచ్చినా ఆరోగ్యశ్రీ కార్డుపై రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యసాయం అందుతుందన్న భరోసా.. కోలుకునే వరకూ జీవన భృతికి ఆరోగ్య ఆసరా ఇస్తారన్న నమ్మకం.. ఇలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పేదల ఆరోగ్యానికి కొండంత అండగా ఉన్న పలు కార్యక్రమాలు కూటమి ప్రభుత్వ పాలనలో కనుమరుగయ్యాయి.

సాక్షి, భీమవరం : ప్రజారోగ్య పరిరక్షణకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారు. ఆరోగ్యం ప్రతిఒక్కరి హక్కుగా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో 1,059 చికిత్సల సంఖ్య (ప్రొసీజర్ల)ను 3,257కి పెంచడంతో పాటు కుటుంబానికి రూ.5 లక్షలు ఉన్న వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. జిల్లాలో ఐదేళ్లలో ఈ పథకం కింద 2.05 లక్షల మందికి రూ.436.32 కోట్లు విలువైన శస్త్రచికిత్సలు అందించారు. కాగా ఎన్‌టీఆర్‌ వైద్యసేవగా పేరుమార్చిన కూటమి ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకుండా రోగులను ఇబ్బందులకు గురి చేస్తోంది. జిల్లాలోని 30 వరకు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ (ఎన్‌టీఆర్‌ వైద్యసేవ) సేవలు అందిస్తున్నాయి. రోజుకు సుమారు 1,500 వరకు ఓపీ నమోదవుతుండగా ఇన్‌ పేషెంట్లుగా చేరేవారు 500 వరకు ఉంటున్నారు. జిల్లాలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు సుమారు రూ.150 కోట్ల మేర బకాయిలు పెట్టడంతో గత ఏప్రిల్‌ రెండో వారంలో జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురంలోని 19 ఆస్పత్రుల్లో సేవలను నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు.

‘ఆరోగ్య ఆసరా’కు ఎసరు

ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స చేయించుకున్న రోగి కోలుకునే వరకూ వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరాగా గత ప్ర భుత్వం జీవన భృతి అందజేసింది. రోజుకు రూ.275 చొప్పున సాయం లెక్కకట్టి అందించేవారు. సాధారణ డెలివరీ, సిజేరియన్‌లకు రూ.5 వేలు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి విరిగిన ఎముకల సర్జరీకి రూ.10 వేలు, కాళ్లకు ఇన్‌ఫెక్షన్‌ సంబంధించి సెల్యులైటీస్‌ కేసులు, కొన్ని కణుతుల చికిత్సలకు రూ.1,575.. ఇలా చికిత్సను బట్టి సాయాన్ని రోగి బ్యాంకు ఖాతాలకు జమచేసేవారు. ఐదేళ్లలో 94,000 మంది లబ్ధిదారులకు రూ.53 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య ఆసరా బిల్లులు చెల్లింపును నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

ఆరిపోయిన ‘కంటి వెలుగు’

గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల ద్వారా జిల్లాలోని ఆచంట, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం సీహెచ్‌సీల్లో ఉచితంగా కంటి వైద్యసేవలు అందించేవారు. అవసరమైన వారికి కళ్లజోళ్లు పంపిణీ, శస్త్రచికిత్సలు చేసేవారు. ఇలా 1,30,733 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. 1,28,358 మందికి రిఫ్రాక్షన్‌ చెక్స్‌, 53,102 మందికి ఫండస్‌ చెక్స్‌, 90,059 మందికి కళ్లజోళ్లు అందజేశారు. 884 డీఆర్‌, 626 గ్లకోమా, 140 మాకులర్‌ డిజనరేషన్‌, 14,080 కాటరాక్ట్‌, 76 హైపర్‌టెన్సివ్‌ రెటినోపతి రోగులను గుర్తించి సంబంధిత వైద్యసేవలు, శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ కేంద్రాలను నిర్వహిస్తున్న కాంట్రాక్టు సంస్థతో మెమోరాండమ్‌ ఆఫ్‌ అండర్‌ స్టాండింగ్‌ (ఎంఓయూ) గడువు గతేడాది సెప్టెంబరు 4తో ము గియగా కూటమి ప్రభుత్వం రెన్యూవల్‌ చేయకపోవడంతో సేవలు నిలిచిపోయాయి. కంటి పరీక్షల కోసం పేదలు రూ.వేలు వెచ్చించి ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.

మెడికల్‌ కళాశాలపై కత్తి

వైద్య విద్యను పేదలకు చేరువ చేయడం, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే లక్ష్యంతో గత ప్రభుత్వం జిల్లాలోని పాలకొల్లులో చేపట్టిన మెడికల్‌ కళాశాలకు కూటమి బ్రేక్‌ వేసింది. 60 ఎకరాల్లో రూ.475 కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించగా ఎన్నికల సమయం నాటికి రూ.74.5 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. కూటమి వచ్చాక నిధులు విడుదల చేయకపోవడంతో నిర్మాణ సంస్థ దాదాపు పనులు నిలిపివేసింది.

గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో అందించిన సేవలు

ఉచిత అడ్మిషన్‌.

అవసరమైన ఆధునిక వైద్య పరీక్షలు, మందులు.

శస్త్రచికిత్స, అందుకు అవసరమైన మందులు, అల్పాహారం, రెండు పూటలా భోజనం.

డిశ్చార్జ్‌ సమయంలో సరిపడా మందులు.

విశ్రాంతి తీసుకునే సమయంలో ఖర్చు నిమిత్తం ఆరోగ్య ఆసరాగా లబ్ధిదారు ఖాతాలో డబ్బులు.

ఇంటికి వెళ్లేందుకు అవసరమయ్యే ప్రయాణ చార్జీలు.

పది రోజుల తర్వాత ఆస్పత్రికి వచ్చి ఉచితంగా వైద్య సేవలు పొందే అవకాశం.

అవసరమైన చికిత్సలకు ఏడాది పాటు డాక్టర్‌ సంప్రదింపులు, వైద్య పరీక్షలు, మందులు కూడా ఉచితం.

వైద్యం పొందే సమయంలో ఆరోగ్య మిత్ర, ఆసుపత్రి సిబ్బంది లేదా మరెవరైనా లంచం అడిగితే 14400 నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసే అవకాశం.

ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం

కూటమి పాలనలో పడకేసిన వైద్యం

నిలిచిన ఆరోగ్య సురక్ష, ముఖ్యమంత్రి ఈఐ కేంద్రం సేవలు

అందని ఆరోగ్య ఆసరా

పాలకొల్లులో అటకెక్కిన వైద్య కళాశాల పనులు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పేదల వైద్యానికి భరోసా

ప్రజలకు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ ఫిజీషియన్‌ సేవలు

నాడు సురక్ష.. నేడు శిక్ష

గత ప్రభుత్వంలో పైసా ఖర్చు లేకుండా పేదలకు వైద్య భరోసా కల్పించిన ఆరోగ్య సురక్ష శిబిరాల నిర్వహణను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. గత ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆరోగ్య సురక్ష శిబిరాల్లో 264 మంది స్పెషలిస్ట్‌ వైద్యులు, 132 మంది మెడికల్‌ ఆఫీసర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది విధుల్లో పాల్గొనేవారు. రక్తం, మూత్రం, ఈసీజీ తదితర 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచి అవసరమైన వారికి అందజేసేవారు. ఏడాది కాలంగా శిబిరాల నిర్వహణ లేకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు స్పెషలిస్ట్‌ వైద్యసేవల కోసం పట్టణాలకు పరుగులు తీయాల్సి వస్తోంది.

వైద్యానికి సుస్తీ 1
1/4

వైద్యానికి సుస్తీ

వైద్యానికి సుస్తీ 2
2/4

వైద్యానికి సుస్తీ

వైద్యానికి సుస్తీ 3
3/4

వైద్యానికి సుస్తీ

వైద్యానికి సుస్తీ 4
4/4

వైద్యానికి సుస్తీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement