
తాళ్లకోడు ఇళ్ల రీ–సర్వేపై జేసీ విచారణ
ఆకివీడు: మండలంలోని కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని జగనన్న కాలనీలోని ఇళ్ల రీ–సర్వేపై తుది విచారణను జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం చేపట్టారు. కాలనీలో గత వారం రోజులుగా ఆరు బృందాలు రీ–సర్వే చేశాయి. అనంతరం భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్రెడ్డి విచారణ చేపట్టారు. కాలనీలో 3,420 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కేటాయించారు. వారికి పట్టాలు కూడా ఇచ్చారు. ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.1.80 లక్షలు అందజేశారు. దీంతో 1000 మంది గృహ ప్రవేశాలు చేశారు. మరో 1200 ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. మిగిలిన నిరుపేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు పునాదులు వేసి, తగిన సొమ్ములేక ఆగిపోయారు. మరికొంత మంది పునాదులు వేసేందుకు సొమ్ములేక ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇళ్లు నిర్మించుకోలేదనే కారణంగా వారి ఇళ్ల స్థలాలను ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు రీ సర్వే ఏర్పాటు చేశారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరుపేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ. 4 లక్షలు తక్షణం విడుదల చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసి పేదల ఇళ్ల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తిచేస్తున్నారు.