
చోరీ కేసులో రూ.31.83 లక్షలు స్వాధీనం
ఏలూరు టౌన్: పోలవరం మండలం జగన్నాథపేటలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడి నుంచి చోరీ సొత్తు రూ.31.83 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ బుధవారం వివరాలు వెల్లడించారు. పోలవరం మండలం జగన్నాధపేట గ్రామానికి చెందిన పద్మనాభుని శ్రీనివాసగుప్త తన కుటుంబంతో కలిసి మే 13న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదను అపహరించుకుపోయారు. చోరీ సొత్తు సుమారుగా రూ.33 లక్షల వరకూ ఉంటుందని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ చోరీ కేసుపై ఎస్పీ ఆదేశాలతో పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి.
ట్రంక్ పెట్టెలో దాచిన చోరీ సొత్తు
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈనెల 3న పోలవరం పోలీసులు నిందితుడు ఉసురుమర్తి గంగాజలంను తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ సమీపంలో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. నిందితుడు చోరీ సొత్తు దాచిపెట్టిన ప్రదేశాన్ని చూపించగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కొంత నగదును నిందితుడు గంగాజలం పేకాటలో పోగొట్టగా.. మిగిలిన నగదు, వస్తువులు పాత ఇంట్లో ట్రంక్ పెట్టెలో దాచిపెట్టాడు. రూ.22,12,082 విలువైన 247.16 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,71,506 విలువైన 2.4 కిలోల వెండి వస్తువులు, రూ.7 లక్షల నగదు కలిపి మొత్తం రూ.31 లక్షల 83 వేల 588 చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలవరం సీఐ బాలసురేష్, ఎస్సై పవన్కుమార్, హెచ్సీ కే.శ్రీనివాస్, జీవీవీఎస్ సత్యనారాయణ, కానిస్టేబుల్ జే.బాబి, కే.కోటేశ్వరరావు, మురళీకృష్ణను ఎస్పీ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇల్లు, షాపుల వద్ద మోషన్ డిటెక్షన్ సీసీ కెమెరాల ఏర్పాటుతో చోరీలను నిరోధించే అవకాశం ఉందని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, పోలవరం డీఎస్పీ, సీఐ పాల్గొన్నారు.
జగన్నాధపేటలో భారీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు
వివరాలు వెల్లడించిన ఎస్పీ ప్రతాప్ శివకిషోర్

చోరీ కేసులో రూ.31.83 లక్షలు స్వాధీనం