
వెబ్ కౌన్సెలింగ్పై ఉపాధ్యాయుల గళం
యలమంచిలి: ఉపాధ్యాయ సంఘాలకు ఇచ్చిన హామీకి భిన్నంగా విద్యాశాఖ అధికారులు ఏకపక్షంగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ కౌన్సెలింగ్ బదులు ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం మండల విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కోశాధికారి పోలిశెట్టి క్రాంతికుమార్ మాట్లాడుతూ విద్యాశాఖ తీసుకునే అసంబద్ధ నిర్ణయాలను ఖండిస్తూ ఉపాధ్యాయ సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బదిలీల్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్గా కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సంఘ అధ్యక్షుడు గుత్తిందీవి శ్రీనివాస్, ఎస్టీయూ సంఘ అధ్యక్షుడు రుద్రరాజు బాల విజయవర్మ, ఉపాధ్యాయులు ప్రేమ్కుమార్, అవధాని, విజయానంద, సత్యనారాయణ, రాంబాబు, శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
పోడూరులో..
పాలకొల్లు సెంట్రల్: ఉపాధ్యాయుల బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిలర్ ఎంవీ రాజశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం పోడూరులో మండల ఉపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకేవీ రామభద్రం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఎస్జీటీలకు మాన్యువల్గా బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాలని, రెండు జిల్లాల్లో ఖాళీలకు ఆన్లైన్లో ఆప్షన్లు ఇవ్వడం కష్టమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం ఎంఈఓ జి.విజయకుమార్, మండల అధ్యక్షుడు డి.క్షేమమూర్తికి వినతిపత్రం అందజేశారు. సంఘాల సభ్యులు బి.శేషగిరిరావు, కె.పెద్దిరాజు పాల్గొన్నారు.

వెబ్ కౌన్సెలింగ్పై ఉపాధ్యాయుల గళం