
సీజనిల్ సేల్స్
ఎన్నో ఏళ్లుగా హోమ్నీడ్స్ వ్యాపారం చేస్తున్నాను. ఏటా సమ్మర్ సీజన్లో 150 వరకు ఏసీ యూనిట్లు అమ్మేవాళ్లం. ఈ ఏడాది సరిగా అమ్మకాలు జరగడం లేదు. అప్పుడే రెండు నెలలు గడిచిపోయినా ఇంకా 25 యూనిట్లు కూడా అమ్మలేదు. ఫ్రిజ్లు, కూలర్ల సేల్స్ కూడా పడిపోయాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఇదీ భీమవరానికి చెందిన ఓ వ్యాపారి ఆవేదన.
సాక్షి, భీమవరం: వేసవి వస్తుందంటే వినియోగదారులతో కిటకిటలాడుతూ కనిపించే ఏసీ, ప్రిజ్, కూలర్లు తదితర హోమ్నీడ్స్ షాపులు ఈ సమ్మర్ సీజన్లో వెలవెలబోతున్నాయి. సమ్మర్ సేల్లో రెండు నెలలు గడిచిపోగా 50 శాతం కూడా అమ్మకాలు జరగలేదని వ్యాపార వర్గాలంటున్నాయి. జనం దగ్గర డబ్బులు లేకపోవడం, విద్యుత్ చార్జీలు పెరిగిపోవడం సేల్స్ పడిపోవడానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లాలో 60 వరకు షాపులు : జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో స్థానిక వ్యాపారులకు చెందిన ఎలక్ట్రికల్ హోమ్నీడ్స్ దుకాణాలు 60 వరకు ఉన్నాయి. సోనోవిజన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ తదితర ప్రముఖ కంపెనీలకు చెందిన బ్రాంచీలు, కార్పొరేట్ షోరూమ్లు 25 వరకు ఉంటాయి. ఆయా సంస్థలు, ఈ–కామర్స్లో సమ్మర్ సేల్స్ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
మార్చి నుంచే మొదలు
ఎండల తీవ్రత పెరగడం వలన ఏసీలు, ఫ్రిజ్లు, కూలర్లు, ఇన్వెర్టర్ల సమ్మర్ సేల్స్ మార్చి నుంచే మొదలవుతాయి. మున్ముందు మరింత పెరిగే ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం ఆయా గృహోపకరణాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తారు. కొత్తగా కొనేవారు కొందరైతే, ఎక్ఛేంజీ ఆఫర్లో పాత వాటిని ఇచ్చేసి కొత్త వస్తువులను తీసుకునే వారు మరి కొందరు. ఆన్లైన్తో పాటు షాపుల్లోనూ ఈఎంఐల పద్ధతిలో ఫైనాన్స్ సదుపాయం ఉండటంతో పేద, మధ్య తరగతి వర్గాల వారు నెలనెలా వాయిదాలు కట్టుకోవచ్చన్న భావనలో ఏసీలు, ఫ్రిజ్ల కొనుగోలుకు ప్రాధాన్యమిస్తున్నారు. సమ్మర్ సీజన్లో జిల్లావ్యాప్తంగా నెలకు 8,000 నుంచి 10,000 ఏసీలు, 3,000 వరకు ఫ్రిజ్లు, 5,000 వరకు కూలర్లు, 4,000 వరకు ఇన్వెర్టర్లు అమ్ముడవుతుంటాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఎన్నికల ప్రభావం వలన గతేడాది అనుకున్నదాని కంటే దాదాపు రెట్టింపు అమ్మకాలు జరిగినట్టు తణుకుకు చెందిన ఓ వ్యాపారి తెలిపారు. సమ్మర్ సీజన్ కోసం మార్చికి ముందే వ్యాపారులు స్టాకులు పెట్టుకున్నారు.
చుక్కలు చూపిస్తున్న విద్యుత్ చార్జీలు
కూటమి పాలనలో విద్యుత్ చార్జీలు సామాన్యు లకు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణ వినియోగమే అయినా గతంతో పోలిస్తే రెట్టింపు బిల్లులు వస్తున్నాయని వినియోగదారులు వాపో తున్నారు. అప్పు చేసి ఏసీ కొందామన్న విద్యుత్ చార్జీలు మరింత పెరిగిపోతాయని, వీటిని సాకుగా చూపించి ప్రభుత్వం భవిష్యత్లో తమకు సంక్షేమ పథకాలు రాకుండా చేస్తుందన్న భయంతో పేద, మధ్యతరగతి వర్గాలు వెనుకడుగేస్తున్నాయి. దీంతో వినియోగదారులు లేక షాపులు వెలవెలబోతున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో సగం అమ్మకాలు కూడా జరగలేదని వ్యాపారులు అంటున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నా అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయని, గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి చూడలేదని చెబుతున్నారు.
షాపులు వెలవెల
కొద్దినెలలుగా మార్కెట్ డల్ అయిపోవడం సమ్మర్ సేల్స్ పైనా పడింది. గత ప్రభుత్వంలో ప్రతి నెలా పథకాలు పేదవర్గాల తలుపు తట్టేవి. కూటమి పాలనలో సంక్షేమం జాడ లేకుండా పోయింది. పనులు కూడా సరిగా లేకపోవ డం, నిత్యావసరాల ధరలకు రెక్కలు రావడం పేద, మధ్యతరగతి వర్గాల జీవన ప్రమాణాలను దుర్భరంగా మార్చేశాయి.
సమ్మర్ మార్కెట్ డల్
పడిపోయిన ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్ల అమ్మకాలు
గతంలో వేసవి ప్రారంభానికి ముందు నుంచే సమ్మర్ సేల్స్ జోరు
ఏటా సమ్మర్ సీజన్లో జిల్లాలో రూ.100 కోట్లకు పైగా అమ్మకాలు
గత రెండు నెలల్లో 50 శాతం కూడా అమ్మకాలు లేవంటున్న వ్యాపారులు
ఎండలు మండుతున్నా.. సంక్షేమం జాడలేక జనం జేబులు ఖాళీ
బెంబేలెత్తిస్తున్న విద్యుత్ బిల్లులు