
కూలబడిన చదువులు
పేదల విద్యకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేసింది. పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. అయితే గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు విద్యపై శీతకన్ను వేస్తోంది. తల్లికి వందనం పథకాన్ని తొలి ఏడాది అటకెక్కించి తల్లుల ఆశలపై నీళ్లు చల్లింది. పేదలపై ఫీజుల భారం మోపుతోంది. నాడు–నేడును నీరుగారుస్తోంది.
గతంలో అల్లారు ‘ముద్ద’గా..
మధ్యాహ్న భోజనం మెనూలోను జగన్ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఆకర్షణీయ మెనూతో రోజుకో కొత్త రుచిని అందిస్తూ జగనన్న గోరుముద్ద పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. పోషక విలువలు కలిగిన పోర్టిఫైడ్ రైస్తో పాటు రాగిజావ, కోడిగుడ్డు, చిక్కీలతో విద్యార్థులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించింది. కాగా డొక్కా సీత మ్మ మధ్యాహ్న భోజనంగా పేరుమార్చిన కూ టమి ప్రభుత్వం పెరిగిన కాయగూరలు, ని త్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ధరలు సవరించక ఆహారంలో నాణ్యత లోపించడంతో ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.
విద్యారంగం.. అస్తవ్యస్తం
● కూటమి ఏడాది పాలనలో అధోగతి
● అమలు కాని ‘తల్లికి వందనం’
● రూ.138 కోట్ల మేర ఫీజు బకాయిలతో విద్యార్థుల ఇక్కట్లు
● విద్యారంగానికి పెద్దపీట వేసిన జగన్ సర్కారు
● నాడు–నేడులో రూ.369 కోట్లతో 1,150 పాఠశాలల అభివృద్ధి
● అమ్మఒడి ద్వారా 1,48,342 మంది తల్లులకు రూ.887.9 కోట్ల లబ్ధి
● ప్రపంచంతో పేద విద్యార్థులు పోటీపడేలా సంస్కరణలు
సాక్షి, భీమవరం : జిల్లాలో ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,436 ఉన్నాయి. శిథిల భవనాలు, పెచ్చులు ఊడే పైకప్పులు, రాళ్లు పైకిలేచిన ప్లోరింగులు, కలుషిత తాగునీరు, అధ్వానమైన టాయిలెట్లు, రక్షణ గోడలు లేక అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలు.. ఇది 2019లో వైఎస్సార్ ప్రభుత్వం వచ్చేనాటికి ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. నాటి సీఎం వైఎస్ జగన్ నాడు–నేడుతో మొదటి విడతగా 497 పాఠశాలల్లో రూ.116.13 కోట్లు విలువైన డిజిటల్ క్లాస్రూంలు, తాగునీటి వసతి, టాయిలెట్స్, కిచెన్షెడ్లు, ప్రహరీ గోడలు, అదనపు తరగతి గదుల నిర్మాణం, విద్యుదీకరణ, మేజర్, మైనర్ మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులు చేశారు. రెండో విడతగా జిల్లాలోని 764 పాఠశాలల్లో రూ.261.37 కోట్ల విలువైన 1,374 పనులు చేపట్టి ఎన్నికల నాటికి రూ.138.66 కోట్ల విలువైన పనులు పూర్తిచేశారు. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో మిగిలిన పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి.
అమ్మఒడితో చేయూత
పిల్లల చదువులకు పేదరికం అడ్డు కాకూడదని గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద ఏటా రూ.15 వేల చొప్పున తల్లులకు ఆర్థిక సాయం అందిస్తూ వ చ్చారు. కాగా చదువుకుంటున్న పిల్లలందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామంటూ చెప్పిన కూటమి ప్ర భుత్వం తొలి ఏడాది ఆ ఊసే ఎత్తలేదు. జిల్లాలో 1,74,763 మంది విద్యార్థులకు రూ.15 వేల చొప్పున గత విద్యా సంవత్సరంలో రూ.262 కోట్ల తల్లికి వందనం సాయానికి ఎగనామం పెట్టింది.
ఉన్నత విద్యకు భరోసా
పేద విద్యార్థులు మధ్యలో ఉన్నత చదువులు మానేయకుండా జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాల ద్వారా గత ప్రభుత్వం ఆదుకుంది. గత ఐదేళ్లలో జగనన్న విద్యాదీవెన పథకం కింద 1,77,996 మంది విద్యార్థులకు రూ.485.33 కోట్లు సాయం అందించగా వసతి దీవెన పథకం కింద 1,76,142 మంది విద్యార్థులకు రూ.163.41 కోట్లు అందించారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజులు చెల్లించక గత జనవరి నాటికి రూ.138.8 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. యాజమాన్యాల ఒత్తిడితో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది.
గత ప్రభుత్వంలో అమ్మఒడి సాయం
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కార్పొరేట్ను తలదన్నేలా..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యావ్యవస్థను తలదన్నే రీతిలో తీర్చిదిద్దారు. మాజీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన నాడు–నేడు ద్వారా సర్కారు బడులు అభివృద్ధి చెందా యి. పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన అందించారు. అలాగే ట్యాబ్లలో, ఐఎఫ్బీ ప్యానెల్స్, బైజూస్ కంటెంట్ అందించారు. జగనన్న విద్యాకానుక వంటి మహత్తర పథకాలు అమలు చేశారు.
– ఎస్.జాకబ్ బాబు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు
గత ప్రభుత్వంలో చదువుల విప్లవం.. డిజిటల్ తరగతులు
దృశ్య, శ్రవణ విద్య ద్వారా విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెంచేందుకు మాజీ సీఎం జగన్ అడుగులు వేశారు. 2022 డిసెంబరు 21న తన పుట్టినరోజున 8వ తరగతి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు ట్యాబుల పంపిణీని ప్రారంభించారు. జిల్లాలోని 14,353 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి బైజూస్ కంటెంట్తో కూడిన రూ.30 వేల విలువైన ట్యాబ్లు అందజేశారు. తర్వాత ఏడాది 13,790 మందికి పంపిణీ చేశారు. తరగతి గదుల్లో డిజిటల్ విద్యాబోధన కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి పాఠశాలలకు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ (ఐపీపీ), స్మార్ట్ టీవీలు అందజేస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ట్యాబుల పంపిణీని నిలిపివేసింది.

కూలబడిన చదువులు

కూలబడిన చదువులు

కూలబడిన చదువులు