
అప్పుల బాధలు తాళలేక..
జంగారెడ్డిగూడెం: పట్టణానికి చెందిన ఓ కుటుంబం అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యాయత్నం చేయగా.. చికిత్స పొందుతూ కుటుంబ యజమాని శుక్రవారం మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక లక్ష్మి ఆస్పత్రి సమీపంలోని అపార్ట్మెంట్లో మంగిన సత్యదుర్గాచంద్రరావు (చంద్రం) (40) భార్య, ఇద్దరు పిల్లల తో జీవిస్తున్నారు. గురువారం వీరు కూల్డ్రింక్ లో కలుపు మందు కలిపి సేవించారు. స్థానికు లు వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చంద్రరావు, భార్య కృష్ణజ్యోతి, కుమారుడు దుర్గాచరణ్, కుమార్తె కోమలికి వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి గుంటూరు తరలించారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ చంద్రరావు శుక్రవారం మృతిచెందారు. భార్య, కుమారుడు, కుమార్తె అక్కడే చికిత్స పొందుతున్నారు. వారికి రక్తం శుద్ధి చేసేందుకు డయాలసిస్ చేస్తున్నట్టు బంధువులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర మాట్లాడుతూ చంద్రరావు కుటుంబం అప్పుల బాధ తాళలేక కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ప్రాథమికంగా తమకు తెలిసిందన్నారు. దీనిపై విచారణ చేస్తున్నట్టు చెప్పారు.
కుటుంబం ఆత్మహత్యాయత్నం
కుటుంబ యజమాని మృతి
చికిత్స పొందుతున్న భార్య, కుమారుడు, కుమార్తె